Gold Coins-Gold Bars: గోల్డ్ బార్స్‌, గోల్డ్ కాయిన్స్ కొంటున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

Gold

Gold

బంగారం అంటే భారతీయులకు కేవలం ఒక లోహం కాదు, అది ఒక భావోద్వేగం. తరాల నుంచి తరాలకు చేరే ఆస్తి కూడా. బ్యాంకుల్లో పెట్టుబడులు పెరిగినా, స్టాక్ మార్కెట్లు విస్తరించినా, డిజిటల్ ఫైనాన్స్ ఎంత అభివృద్ధి చెందినా… చేతిలో పట్టుకునే బంగారంపై భారతీయుల మక్కువ మాత్రం తగ్గడం లేదు. అందుకే 2026 జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ప్రజలు ఏకంగా 62 టన్నుల బంగారు బిస్కెట్లు, నాణేలు కొనుగోలు చేశారు. ఇదే సమయంలో గోల్డ్ ఈటీఎఫ్‌లలో నమోదైన నికర డిమాండ్ కేవలం 20 టన్నులే కావడం ఆసక్తికరంగా మారింది. ప్రపంచ స్వర్ణ మండలి విడుదల చేసిన “డిమాండ్ ట్రెండ్స్ ఇండియా ఫోకస్” నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

నగలు కొనుగోలు ఇప్పటికీ భారతీయుల సంస్కృతిలో భాగమే అయినప్పటికీ, పెట్టుబడి కోణంలో చూస్తే చాలామంది బంగారు బార్లు, నాణేల వైపే మొగ్గు చూపుతున్నట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా పండుగలు, వివాహాలు, శుభకార్యాల సమయంలో బంగారం కొనడం అదృష్ట సూచికగా భావించే సంప్రదాయం ఇప్పటికీ బలంగానే ఉంది. అందుకే డిజిటల్ పెట్టుబడి సాధనాలు అందుబాటులోకి వచ్చినా, “చూసి తాకగలిగే ఆస్తి” అనే భావన భారతీయుల్లో బలంగా నిలిచిపోయింది.

నిపుణుల మాటల్లో చెప్పాలంటే, భౌతిక బంగారం అంటే ప్రజలకు మానసిక భద్రత. ఆర్థిక అనిశ్చితి సమయంలో డబ్బు విలువ తగ్గినా, బంగారం విలువ నిలుస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. ద్రవ్యోల్బణానికి ఎదురొడ్డి నిలిచే ఆస్తిగా కూడా బంగారాన్ని చాలా కుటుంబాలు భావిస్తున్నాయి. అంతేకాదు, తరాల మధ్య సంపద బదిలీకి కూడా ఇది ప్రధాన సాధనంగా మారింది. ఇటీవలి కాలంలో బంగారం ధరలు వేగంగా పెరగడం కూడా బంగారు నాణేలు, బార్ల కొనుగోళ్లను మరింత పెంచిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే పెట్టుబడి కోణంలో చూస్తే భౌతిక బంగారానికి కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. మార్కెట్ ధరపై అదనంగా 2 నుంచి 10 శాతం వరకు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. నాణేలకు మింటింగ్ ఛార్జీలు కూడా ఉంటాయి. వాటిపై 3 శాతం జీఎస్టీ తప్పనిసరి. బ్రాండెడ్ లేదా ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకేజింగ్ ఉంటే అదనపు ఖర్చులు వస్తాయి. కొనుగోలు చేసిన తర్వాత భద్రపరచడానికి లాకర్ ఖర్చులు, ఇన్సూరెన్స్ ఖర్చులు కూడా తప్పవు. తిరిగి అమ్మే సమయంలో మార్కెట్ ధర కంటే తక్కువ ధరే రావడం వల్ల నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

ఇదే సమయంలో గోల్డ్ ఈటీఎఫ్‌లు మాత్రం పూర్తిగా పెట్టుబడి దృష్టితో ఆలోచించే వారికి అనుకూలంగా మారుతున్నాయి. స్టాక్ ఎక్స్చేంజ్‌లలో రియల్ టైమ్ ధరలతో కొనుగోలు, అమ్మకాలు చేయవచ్చు. ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. 0.05 శాతం నుంచి 0.80 శాతం వరకు మాత్రమే ఎక్స్‌పెన్స్ రేషియో ఉండడం పెట్టుబడిదారులకు ప్రయోజనంగా మారుతోంది. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్, రీబ్యాలెన్సింగ్ వంటి అంశాల్లో కూడా ఈటీఎఫ్‌లు సులభతరం చేస్తాయి.

అయితే చివరికి నిర్ణయం వ్యక్తిగత అవసరాలపైనే ఆధారపడి ఉంటుంది. బహుమతులు ఇవ్వడానికి, సంప్రదాయ అవసరాల కోసం, చేతిలో కనిపించే ఆస్తి కావాలనుకునే వారికి భౌతిక బంగారం సరైన ఎంపికగా భావిస్తున్నారు. క్రమశిక్షణతో పెట్టుబడి పెంచుకోవాలని భావించే వారికి గోల్డ్ ఈటీఎఫ్‌లు అనుకూలమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. చాలామంది ఇప్పుడు ఈ రెండు మార్గాల మేళవింపునే ఎంచుకుంటున్నారు. భావోద్వేగానికి భౌతిక బంగారం… పెట్టుబడికి ఈటీఎఫ్‌లు… ఇదే ఇప్పుడు భారతీయుల కొత్త బంగారు వ్యూహంగా మారుతోంది.