Forbes Best Under a Billion 2026: ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. దీనికి తాజా ఉదాహరణగా ఫోర్బ్స్ ఆసియా విడుదల చేసిన ప్రతిష్టాత్మక ‘బెస్ట్ అండర్ ఎ బిలియన్ 2026’ జాబితా నిలిచింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని అత్యుత్తమ చిన్న, మధ్య తరహా పబ్లిక్ లిస్టెడ్ కంపెనీల్లో ఎంపికైన 200 సంస్థల జాబితాలో ఏకంగా 27 భారతీయ కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. 28 కంపెనీలతో చైనా మొదటి స్థానంలో నిలవగా, కేవలం ఒక కంపెనీ తేడాతో భారత్ రెండో స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సఫ్లై చైన్ సమస్యలు, ఇంధన మార్కెట్లలో అస్థిరత వంటి అనేక సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ భారతీయ కంపెనీలు బలమైన ఆర్థిక పనితీరు, నిలకడైన ఆదాయ వృద్ధి, మెరుగైన లాభదాయకతతో అంతర్జాతీయంగా తమ ప్రత్యేకతను చాటుకున్నాయి. ఈ కారణంగానే ఫోర్బ్స్ ఎంపిక చేసిన అత్యుత్తమ సంస్థల్లో భారత కంపెనీల సంఖ్య గణనీయంగా పెరిగింది.
ఈ ఏడాది జాబితాలో మరో ముఖ్యమైన అంశం కృత్రిమ మేధస్సు (AI), సాఫ్ట్వేర్, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్ భాగాల తయారీ రంగాల ఆధిపత్యం. ఎంపికైన మొత్తం కంపెనీలలో దాదాపు 25 శాతం సంస్థలు ఈ రంగాలకు చెందినవే. అదనంగా డేటా సెంటర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు), పునరుత్పాదక ఇంధనం, పారిశ్రామిక సాంకేతికత, అధునాతన తయారీ రంగాల్లో పనిచేస్తున్న సంస్థలు కూడా విశేష ప్రదర్శన కనబరిచాయి. భవిష్యత్ సాంకేతికతలపై పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయనే సంకేతాలను ఈ జాబితా స్పష్టంగా తెలియజేస్తోంది.
కేవలం ర్యాంకింగ్ మాత్రమే కాదు..
27 కంపెనీలతో భారత్ రెండో స్థానంలో నిలవడం కేవలం ఒక ర్యాంకింగ్ మాత్రమే కాదు. భారతీయ స్మాల్, మిడ్ క్యాప్ కంపెనీలు దేశీయ మార్కెట్కే పరిమితం కాకుండా ప్రపంచ స్థాయిలో పోటీ పడే సామర్థ్యాన్ని సంపాదించాయని ఇది సూచిస్తోంది. డిజిటల్ పరివర్తన, ఇంజనీరింగ్, తయారీ, ఆరోగ్య సంరక్షణ, ప్రత్యేక రసాయనాలు, అధిక విలువ కలిగిన పారిశ్రామిక రంగాల్లో భారత కంపెనీలు వేగంగా ఎదుగుతున్నాయని ఈ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే రాబోయే సంవత్సరాల్లో భారత్ అగ్రస్థానానికి చేరే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
చైనా ఫస్ట్.. భారత్ సెకండ్..
దేశాల వారీగా చూస్తే చైనా 28 కంపెనీలతో మొదటి స్థానం, భారత్ 27 కంపెనీలతో రెండో స్థానం సాధించాయి. మలేషియా 19 కంపెనీలతో మూడో స్థానంలో నిలిచి ఆకట్టుకుంది. ఫోర్బ్స్ ప్రకారం, ఆ దేశంలో ఏఐ మౌలిక సదుపాయాల విస్తరణ ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది. అలాగే ఈ ఏడాది జాబితాలోని 200 కంపెనీలలో 60 సంస్థలు వరుసగా రెండో ఏడాది కూడా తమ స్థానాలను నిలబెట్టుకోవడం, వాటి స్థిరమైన వ్యాపార నమూనాలు, బలమైన ఆర్థిక నిర్వహణకు నిదర్శనంగా పేర్కొంది.
19 వేలకుపైగా లిస్టెడ్ కంపెనీల పరిశీలన..
ఈ జాబితా ఎంపిక కోసం ఫోర్బ్స్ ఆసియా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని 19 వేలకుపైగా లిస్టెడ్ కంపెనీలను పరిశీలించింది. వార్షిక అమ్మకాలు 10 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల మధ్య ఉన్న సంస్థలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. కంపెనీల రుణభారం, ఒకటి మరియు మూడు సంవత్సరాల అమ్మకాల వృద్ధి, ఒక్కో షేరుపై ఆదాయం (EPS), ఈక్విటీపై రాబడి (ROE), లాభదాయకత, ఆర్థిక బలం, దీర్ఘకాలిక పనితీరు వంటి పలు ప్రమాణాల ఆధారంగా మూల్యాంకనం జరిగింది. ఈ విశ్లేషణ 2026 జూలై 10 వరకు అందుబాటులో ఉన్న ఆర్థిక సమాచారం ఆధారంగా నిర్వహించినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది.
మొత్తంగా చూస్తే, ఈ ఫోర్బ్స్ జాబితా భారత కంపెనీల పెరుగుతున్న సామర్థ్యానికి, ప్రపంచ స్థాయిలో పెరుగుతున్న గుర్తింపుకు మరో నిదర్శనంగా నిలిచింది. కేవలం ఒక కంపెనీ తేడాతో చైనా తర్వాత రెండో స్థానంలో నిలవడం, ఆసియా కొత్త వృద్ధి కథలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.

