ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిరత భారతీయుల వంటింట్లో మంటలు పుట్టిస్తోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్త సరఫరా గొలుసును దెబ్బతీసింది. దీని ప్రభావంతో భారత్లో వంట నూనెల ధరలు అమాంతం పెరిగిపోయాయి. రవాణా ఖర్చులు పెరగడం ఒక కారణమైతే, ఇదే అదనుగా భావించిన కొందరు వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టిస్తూ ధరలను పెంచుతున్నారు. ఫలితంగా సామాన్యుడి బడ్జెట్ తలకిందులై, నిత్యావసరాల కొనుగోలు పెను భారంగా మారింది.
గత నెల రోజుల్లోనే వంట నూనెల ధరలు సుమారు 22 శాతం మేర పెరిగాయి. వివిధ రకాల నూనెల ధరల వ్యత్యాసాన్ని పరిశీలిస్తే.. సన్ ఫ్లవర్ ఆయిల్ గతంలో రూ. 180 ఉన్న ధర ప్రస్తుతం రూ. 200లకు చేరింది. పేద ప్రజలు ఎక్కువగా వాడే పామాయిల్ నూనె ధర రూ. 120 నుంచి రూ. 145కు పెరిగింది. వేరుశనగ నూనె విషయానికి వస్తే.. లీటరుపై రూ. 15 మేర పెరుగుదల కనిపించగా, 15 కిలోల హోల్సేల్ టిన్ను ధర రూ. 2300 నుండి రూ. 2400కు చేరుకుంది. ఇక సోయాబీన్, రైస్ బ్రాన్, వనస్పతి, ఆవ నూనెల ధరలు కూడా లీటరుకు రూ. 15 నుంచి రూ. 30 వరకు అదనపు భారాన్ని మోపుతున్నాయి.
సామాన్యుడిపై ప్రభావం…
కేవలం వంట నూనెలే కాకుండా, గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరగడం సామాన్యుడిని కోలుకోలేని దెబ్బ తీస్తోంది. వాణిజ్య సిలిండర్ల ధరల పెరుగుదల వల్ల హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. అటు వంటింట్లో నూనె మంట, ఇటు గ్యాస్ భారం వెరసి మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక స్థితిగతులు అస్తవ్యస్తమవుతున్నాయి.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. కృత్రిమ కొరత సృష్టిస్తున్న నిల్వదారులపై నిఘా ఉంచడం, అక్రమ తనిఖీలు నిర్వహించడం ద్వారా ధరలను అదుపులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. అంతర్జాతీయ సంక్షోభం సాకుతో సామాన్యుడిని దోచుకోకుండా కఠిన చర్యలు తీసుకోవడం ద్వారానే సామాన్యుడి జేబుకు పడుతున్న చిల్లును అరికట్టవచ్చు. ప్రభుత్వం సబ్సిడీలు లేదా దిగుమతి సుంకాల్లో మార్పుల ద్వారా ధరల నియంత్రణకు చొరవ చూపాలి.
