నష్టాల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను మరో సంస్థకు అప్పగించేందుకు రంగం సిద్ధం అయ్యిందంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి.. దీని కోసం ప్రభుత్వం ఇప్పటికే బిడ్లను ఆహ్వానించినా.. ఎక్కువ సంస్థలు మాత్రం పోటీ పడింది లేదు.. ఈ దశలో చివరి వరకు నిలిచింది మాత్రం టాటా గ్రూపే.. దీంతో.. టాటా గ్రూప్ చేతికి ఎయిరిండియా వెళ్లిపోయిందనే వార్తలు గుప్పుమన్నాయి.. ఎయిరిండియాని 68 ఏళ్ల తర్వాత ఆ సంస్థ అసలు యజమాని అయినట్టువంటి టాటా గ్రూప్ చేతికి వెళ్లిందనేది ఆ కథనం సారాశం.. అయితే, ఆ వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది..
టాటా గ్రూప్.. ఎయిరిండియాను తిరిగి సొంతం చేసుకుందన్న బ్లూమ్బర్గ్ కథనాన్ని తప్పుబట్టిన కేంద్రం.. ఆ వ్యవహారంలో వివరణ ఇచ్చింది.. ఎయిరిండియా పెట్టుబడుల ఉపసంహరణలో ఆర్థిక బిడ్లను ప్రభుత్వం ఆమోదించిందన్న వార్తల్లో వాస్తవం లేదని ఆర్థికశాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.. ఎయిరిండియా ప్రైవేటీకరణ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా వెల్లడిస్తామని తెలిపింది. కాగా, ఎయిరిండియా సంస్థ కోసం డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించింది.. బిడ్లు వేసేందుకు నలుగురు మాత్రమే ముందుకు రాగా.. అందులో టాటా గ్రూప్ మాత్రమే చివరి దశవరకూ వెళ్లింది.. మరోవైపు 2018లో ఎయిరిండియాను అమ్మడానికి చేసిన ప్రయత్నాలు కూడా ముందుకు సాగలేదు.. ఇక, ఎయిరిండియా డిఇన్వెస్ట్మెంట్ విషయంలో భారత ప్రభుత్వం ఆర్థిక బిడ్ల ఆమోదాన్ని సూచించే వార్తలు తప్పు అని ఇన్వెస్ట్మెంట్ మరియు పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ క్లారిటీ ఇచ్చింది.
