Business Today: హైదరాబాద్ సిగలో మరో అంతర్జాతీయ కేంద్రం
విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్కి మరో ఇంటర్నేషనల్ కంపెనీ వచ్చింది. స్విట్జర్లాండ్కు చెందిన ఎంఎన్సీ రోషె ఫార్మా తన డేటా సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటుచేసింది. ఈ కేంద్రాన్ని గ్లోబల్ అనలిటిక్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా పిలుస్తారు. షార్ట్ కట్లో ‘గేట్’ అని కూడా వ్యవహరిస్తారు. ఇక్కడ మరో రెండు నెలల్లో 100 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ సంస్థకు ఇది ఇండియాలో రెండో డేటా అనలిటిక్స్ సెంటర్ మాత్రమే కావటం విశేషం.
హెటెరో చేతికి ‘జాన్సన్ అండ్ జాన్సన్’
జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తెలంగాణ ప్లాంట్ను 130 కోట్ల రూపాయలకు అక్వైర్ చేసుకున్నట్లు హైదరాబాద్లోని ప్రముఖ ఫార్మా సంస్థ హెటెరో డ్రగ్స్ ప్రకటించింది. జాన్సన్ అండ్ జాన్సన్కు మహబూబ్ నగర్ జిల్లాలోని పెంజెర్లలో ఈ తయారీ కేంద్రం ఉంది. ఈ ప్లాంట్ను డెవలప్ చేసేందుకు 600 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నామని హెటెరో తెలిపింది. 55 ఎకరాలకు పైగా స్థలంలో విస్తరించి ఉన్న ఈ ఫెసిలిటీ.. హెటెరోకి స్టెరైల్ ఫార్మాస్యుటికల్స్ మరియు బయొలాజిక్స్ మ్యానిఫ్యాక్షరింగ్ యూనిట్గా మారనుంది. దీని ద్వారా 2 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది.
బీమా సంస్థలకు రూ.5 వేల కోట్లు
ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కేంద్రం 5 వేల కోట్ల రూపాయలను ఈక్విటీ సపోర్ట్గా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇప్పటికే ఇచ్చిన 5 వేల కోట్లకు అదనమని చెబుతున్నారు. ఈ నిధులను డిసెంబర్ త్రైమాసికం లోపు విడుదల చేసే అవకాశం ఉంది. ఇదిలాఉండగా.. జనరల్ ఇన్సూరెన్స్ సంస్థల ఉద్యోగుల వేతనాల సవరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ వార్తలు కూడా రావటం చెప్పుకోదగ్గ విషయం. వేతన సవరణ వల్ల ఆయా సంస్థలపై 8 వేల కోట్ల రూపాయల వరకు భారం పడనుంది.
ఇండియాపై చైనా ప్రభావం
దీపావళి పండుగ అనంతరం ఇండియాలోని కన్జ్యూమర్ డ్యూరబుల్ ఇండస్ట్రీపై చైనా జీరో కొవిడ్ స్ట్రాటజీ ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మన దేశంలో తయారయ్యే పాతిక నుంచి 75 శాతం వరకు వైట్ గూడ్స్కి విడి వస్తువులు ఆ దేశం నుంచే రావాల్సి ఉంది. 75 శాతం ఎయిర్ కండిషనర్లు చైనా దిగుమతుల మీదే ఆధారపడ్డాయి. కరోనా అనంతరం ఈ రెండు దేశాల మధ్య సప్లై చెయిన్లో సమస్యలు తలెత్తాయి. దీంతో ఇప్పటికే ఇండియాలోని కొన్ని కంపెనీలు ఫెస్టివ్ సీజన్ కన్నా ముందు నుంచే విడి భాగాల కొరతను ఎదుర్కొంటున్నాయి.
ఎల్ఆర్ఎస్ కింద పెరుగుతున్న రెమిటెన్స్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2004వ సంవత్సరంలో ప్రారంభించిన లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద ఇండియన్లు పంపుతున్న ఫండ్స్లో పెరుగుదల నమోదవుతోంది. ఆర్బీఐ డేటా ప్రకారం ఆగస్టు నెలలో 2 పాయింట్ ఆరు ఏడు బిలియన్ డాలర్లకు పైగా పంపారు. ఇది జులై నెలతో పోల్చితే దాదాపు 35 శాతం ఎక్కువ కావటం గమనించాల్సిన విషయం. గతేడాది ఆగస్టు కన్నా కూడా సుమారు 36 శాతం అధికం కావటం చెప్పుకోదగ్గ అంశం. మరోవైపు ఆగస్టు చివరికి ఎన్ఆర్ఐ డిపాజిట్లు 134 పాయింట్ ఆరు ఎనిమిది బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఇవి గతేడాది ఆగస్టు చివరి నాటికి 141 పాయింట్ ఐదు రెండు బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
జీ ఎంటర్టైన్మెంట్లో వాటా విక్రయం
జీ ఎంటర్టైన్మెంట్లో 5 పాయింట్ ఐదు ఒకటి శాతం వాటాని ఇన్వెస్కో డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ 13 వందల కోట్ల రూపాయలకి పైగా విలువకు విక్రయించనుంది. ఈ కంపెనీ గత ఏడు నెలల్లో వాటా అమ్మటం ఇది రెండోసారి. ఏప్రిల్ నెలలో 7 పాయింట్ 8 శాతం వాటాను అమ్మేసింది. దీంతో ప్రస్తుతం 10 పాయింట్ ఒకటీ నాలుగు శాతం మాత్రమే షేర్ ఉంది. ఇందులో దాదాపు సగం వాటాను ఇవాళ బ్లాక్ డీల్ పద్ధతిలో విక్రయించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
స్టాక్ మార్కెట్ అప్డేట్
గ్లోబల్ మార్కెట్లలో సానుకూల సంకేతాల ప్రభావంతో ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు ఇవాళ భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 590 పాయింట్లు పెరిగి 59000 పైనే ట్రేడింగ్ అవుతోంది. నిఫ్టీ 126 పాయింట్లు ప్లస్సయి 17438 వద్ద కొనసాగుతోంది. అదానీ ట్రాన్స్మిషన్, ఎస్జేవీఎన్, ‘జీ’, పీవీఆర్ స్టాక్స్ ఆశాజనకంగా ఉన్నాయి. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 82.38 వద్ద ఉంది.
