business headlines: ‘రిలయెన్స్’ ఆదాయం అదుర్స్
ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అదిరిపోయే ఆదాయాన్ని నమోదుచేసింది. ఈ ఆర్థికం సంవత్సరంలోని మొదటి మూడు నెలల ఫలితాలను వెల్లడించింది. గ్రూపు సంస్థల మొత్తం ఆదాయం ఏకంగా 53 శాతం పెరిగి 2.43 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. ఆయిల్ మరియు టెలికం కంపెనీలు బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూపాయని కంపెనీ తెలిపింది.
ఈ నెలాఖరే.. పొడిగింపు లేదు
గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలుచేసేందుకు ఈ నెలాఖరే చివరి తేదీ అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ గడువును పొడిగించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. గతేడాది డిసెంబర్ 31వ తేదీ వరకు ఛాన్స్ ఇవ్వటంతో ఈసారీ అలాగే పొడిగించవచ్చు అనుకుంటున్నారని, అయితే అలాంటి ఆలోచనేదీ ప్రస్తుతానికి తమకు లేదని పేర్కొంది.
read also: KTR: ‘బీఎస్ కుమార్’.. భలే సెటైర్. ఆకట్టుకున్న కేటీఆర్ కౌంటర్.
పెరగనున్న పంచదార ఉత్పత్తి
ఈ ఏడాది అక్టోబర్ నుంచి వచ్చే సంవత్సరం సెప్టెంబర్ వరకు కొనసాగనున్న సీజన్లో చక్కెర ఉత్పత్తి 5 లక్షల టన్నులు పెరగనుందనే అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది చెరకు సాగు విస్తీర్ణం 4 శాతం పెరిగింది. ప్రస్తుత సీజన్లో 394 లక్షల టన్నుల పంచదార ఉత్పత్తి కాగా వచ్చే సీజన్లో 399 టన్నులు ఉత్పత్తి కావొచ్చని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ తెలిపింది.
రష్యాలో వడ్డీ రేట్ల తగ్గింపు
రష్యా కేంద్ర బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లను 9 పాయింట్ 5 శాతం నుంచి 8 శాతానికి తగ్గించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతుంటే రష్యా మాత్రం తగ్గించటం విశేషం. మే నెలలో 17 పాయింట్ 1 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం ఈ నెలలో 15 పాయింట్ 5 శాతానికి తగ్గటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
మళ్లీ తగ్గిన ఫారెక్స్ నిల్వలు
మన విదేశీ మారక నిల్వలు మరోసారి తగ్గాయి. కిందటిసారితో పోల్చుకుంటే ఈసారి 754 కోట్ల డాలర్లు పడిపోయాయి. ఈ నెల 15వ తేదీ నాటికి మొత్తం ఫారెక్స్ నిల్వలు 57 వేల 271 కోట్ల డాలర్లు ఉన్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఈ నిల్వలను పెంచేందుకు ఆర్బీఐ ఇటీవల కొన్ని చర్యలు తీసుకుంది. దీంతో విదేశాల నుంచి చెల్లింపులు పెరిగాయి. అందువల్ల ఈ నెలాఖరున వెలువడే ఫలితాల్లో ఫారెక్స్ నిల్వలు పెరగొచ్చని భావిస్తున్నారు.
గోధుమపై ఆందోళన వద్దు
దేశంలో గోధుమ సంక్షోభం ఆనవాళ్లే లేవని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది. గోధుమ ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధం విధించటం వల్ల రైతుల ఆదాయానికి వస్తున్న నష్టం కూడా ఏమీ లేదని తెలిపింది. దేశానికి అవసరమైన గోధుమల కన్నా ఎక్కువే ఉత్పత్తి జరుగుతోందని పేర్కొంది. గోధుమల రేట్లు కూడా కనీస మద్దతు ధర కన్నా ఎక్కువే ఉన్నట్లు వెల్లడించింది.
