Budget 2026 Expectations: దేశం మొత్తం ఢిల్లీ వైపు ఆసక్తిగా చూస్తోంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్పై ఎంతో మంది ఆశావహులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బడ్జెట్ 2026 భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టంగా నిలవబోతోంది. బడ్జెట్ రోజున ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం దాకా పార్లమెంట్లో జరిగే ప్రసంగం దేశమంతా ఆసక్తిగా చూస్తోంది. ఈసారి బడ్జెట్ ఒక మధ్య దశలో వస్తోంది. గత సంవత్సరం ప్రభుత్వం విస్తృతంగా ఖర్చు చేసే బడ్జెట్ ఇచ్చింది. మరోవైపు త్వరలోనే కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి రానుంది. అందుకే ఈ బడ్జెట్ భారీ సంచలనాల కంటే.. రెండు దశల మధ్య వారధిలా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
READ MORE: Suriya-46 : సూర్య కోసం వెంకీ ‘యూనివర్సల్’ స్కెచ్.. అందరికీ అర్థమయ్యేలా స్పెషల్ టైటిల్!
గతేడాది కొత్త పన్ను విధానంలో మార్పులు చేసి, 12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి దాదాపు పన్ను భారం లేకుండా చేశారు. అందుకే ఈ ఏడాది ఈసారి కొత్త స్లాబ్లు లేదా పెద్ద రేటు మార్పులు ఉంటాయని నిపుణులు భావించడం లేదు. కానీ పన్ను రిటర్నులు వేగంగా రావడం, నిబంధనలు సులభంగా ఉండటం, ట్యాక్స్ ఫైలింగ్లో ఉండే చిన్న చిన్న సమస్యలు తొలగించడం మీద ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం ఉంది. దేశ ఆర్థిక పరిస్థితి చూస్తే బలం ఉన్నట్టే కనిపిస్తోంది. కానీ జాగ్రత్త తప్పదు. ఎకనామిక్ సర్వే ప్రకారం 2026–27లో దేశ వృద్ధి రేటు 6.8 నుంచి 7.2 శాతం మధ్య ఉండొచ్చు. ఇది గత ఏడాదితో పోలిస్తే కొంచెం తక్కువైనా, ప్రపంచంలోనే వేగంగా పెరుగుతున్న దేశాల్లో భారత్ ముందే ఉంటుంది. ప్రభుత్వ లోటు సైతం క్రమంగా తగ్గిస్తున్నారు. 2025లో జీడీపీలో 4.8 శాతంగా ఉన్న లోటును 2026లో 4.4 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
READ MORE: Astrology: ఫిబ్రవరి 1, ఆదివారం దినఫలాలు..
అయినా ప్రభుత్వం పెట్టుబడులపై వెనకడుగు వేయలేదు. ఈ ఏడాది క్యాపిటల్ ఖర్చు 11.21 లక్షల కోట్లుగా ఉంది. మొత్తం ప్రభావవంతమైన ఖర్చు 15.48 లక్షల కోట్లకు చేరింది. రోడ్లు, పోర్టులు, ఎనర్జీ, రక్షణ రంగాల మీద పెట్టుబడులు ఆర్థిక వృద్ధికి బలంగా నిలుస్తున్నాయి. ద్రవ్యోల్బణం సైతం అదుపులోనే ఉంది. ఏప్రిల్ నుంచి డిసెంబర్ 2025 మధ్య సగటున 1.7 శాతం మాత్రమే ఉండటం ప్రభుత్వానికి కొంత ఊరటనిచ్చింది. అయితే ప్రపంచ పరిస్థితులు మాత్రం సవాలుగానే ఉన్నాయి. అమెరికా టారిఫ్లు పెరగడం వల్ల భారత ఎగుమతులపై ఒత్తిడి పెరిగింది. ఒక దశలో భారత ఉత్పత్తులపై 50 శాతం వరకు ట్యాక్స్ పడింది. దీనితో భారత్ ప్రపంచంలోనే ఎక్కువ పన్నులు చెల్లించే ఎగుమతి దేశాల్లో ఒకటిగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తన వాణిజ్య విధానాలను పునరాలోచన చేస్తోంది.
READ MORE: Ambati Rambabu : మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్..
గతేడాది జీఎస్టీ సంస్కరణల ద్వారా దేశీయ వినియోగాన్ని పెంచే ప్రయత్నం చేసింది. ఎగుమతిదారులకు కొంత ఊరట ఇచ్చింది. ఇప్పుడు దిగుమతులపై ఆధారపడే రంగాల్లో కస్టమ్స్ డ్యూటీలు పెంచడం, దేశీయ తయారీకి ప్రోత్సాహం ఇవ్వడం గురించి ఆలోచిస్తోంది. పరిశ్రమలు సైతం ఒక్క దేశం మీద ఆధారపడకుండా సరఫరా గొలుసులను విస్తరించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం సూచిస్తోంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఈ బడ్జెట్లో ప్రధానంగా ఉండే అవకాశం ఉంది. ఎంఎస్ఎంఈలు కేవలం రుణాలతోనే సమస్యలు పరిష్కారమవ్వవని చెబుతున్నాయి. టెక్నాలజీ అప్గ్రేడేషన్, ఎగుమతులకు సహాయం, దీర్ఘకాలిక మద్దతు కావాలని కోరుతున్నాయి. టెక్నాలజీ అప్గ్రేడేషన్కు మళ్లీ సబ్సిడీలు ఇవ్వాలి, పెట్టుబడి పరిమితిని 1 కోటి నుంచి 2 కోట్లకు పెంచాలి, ముఖ్యంగా గ్రీన్ టెక్నాలజీ వైపు వెళ్లేందుకు సహాయం చేయాలన్నది వారి డిమాండ్.
READ MORE: IND vs NZ 5th T20: అర్ష్దీప్ సింగ్ ‘పంజా’, ఇషాన్ విధ్వంసం.. కివీస్ పై భారత్ ఘన విజయం
పెద్ద పరిశ్రమలు సైతం ఆశావహంగానే ఉన్నాయి. భారతదేశాన్ని ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టాలని సీఐఐ కోరుతోంది. దేశీయ డిమాండ్ పెరగడం, లాభాలు మెరుగవడం వల్ల బిజినెస్ నమ్మకం పెరిగింది. వచ్చే నెలల్లో ఇంకా వృద్ధి వేగం పెరుగుతుందని చాలా కంపెనీలు భావిస్తున్నాయి. ప్రభుత్వ పెట్టుబడులు కొనసాగితేనే ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయని పరిశ్రమల అభిప్రాయం. అందుకే కొత్త నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ 2.0 తీసుకురావాలని సూచిస్తున్నారు. త్వరగా పూర్తి చేయగల ప్రాజెక్టులు, ఆదాయం తెచ్చే పనులు, కేసులు త్వరగా పరిష్కరించే విధానం ఉండాలని కోరుతున్నారు. ఇంకా కొత్త అంశాలు కూడా ఈ బడ్జెట్ చుట్టూ తిరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, క్లీన్ ఎనర్జీ, బయోటెక్నాలజీ లాంటి రంగాల్లో అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని పరిశ్రమలు సూచిస్తున్నాయి. విదేశాల్లో ఉన్న నిపుణులను భారత్కు తీసుకువచ్చేందుకు ప్రత్యేక టాలెంట్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా ఉంది.
READ MORE: IND vs NZ 5th T20: అర్ష్దీప్ సింగ్ ‘పంజా’, ఇషాన్ విధ్వంసం.. కివీస్ పై భారత్ ఘన విజయం
డిజిటల్ పాలన మీద సైతం ఆశలు ఉన్నాయి. పేపర్లెస్ విధానం, వేగవంతమైన అనుమతులు, సులభమైన నిబంధనలు ఉంటే వ్యాపారం చేయడం మరింత ఈజీ అవుతుందని భావిస్తున్నారు. ఫైనాన్షియల్ రంగంలో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, కొత్త పెట్టుబడులపై కూడా మార్పులు ఆశిస్తున్నారు. టెక్నాలజీ, ముఖ్యంగా ఏఐని కేవలం మాటల్లో కాకుండా, నిజంగా దేశానికి కీలక మౌలిక వసతిగా చూడాలని పరిశ్రమ కోరుతోంది. డేటా సెంటర్లకు చౌక విద్యుత్, స్పష్టమైన నిబంధనలు, దేశీయ ఏఐ మోడళ్లకు మద్దతు కావాలన్నది ప్రధాన డిమాండ్. తయారీ రంగం, వ్యవసాయం, ఉద్యోగాల సృష్టి కూడా మళ్లీ కేంద్ర బిందువుగా మారాయి. ఇండస్ట్రియల్ కారిడార్లు, ఎగుమతులకు అనుకూలమైన క్లస్టర్లు, అగ్రి ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజ్, లాజిస్టిక్స్ ఇవన్నీ విస్తృతంగా మద్దతు పొందాలని పరిశ్రమలు ఆశిస్తున్నాయి. దేశానికి ప్రతి ఏడాది లక్షల ఉద్యోగాలు అవసరం. అందుకే స్కిల్ డెవలప్మెంట్, ఎంఎస్ఎంఈ మద్దతు, స్థిరమైన ఉపాధి కల్పించే విధానాలపై అందరి చూపు ఉంది. మొత్తానికి ఈ బడ్జెట్ పెద్ద ప్రకటనలకంటే సమతుల్య నిర్ణయాలపై ఆధారపడేలా కనిపిస్తోంది.
