Dollar vs UPI: డాలర్ ఆధిపత్యానికి బ్రేక్ వేయనున్న BRICS.. భారత్‌దే కీలక పాత్ర!

  • UPIతో కొత్త పేమెంట్ సిస్టమ్‌కు భారత్ ప్లాన్
  • డాలర్ ఆధిపత్యానికి చెక్ పెట్టే దిశగా అడుగులు..
Brics

Brics

Dollar vs UPI: భారత్ వేదికగా జరగనున్న BRICS శిఖరాగ్ర సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులతో పాటు ప్రపంచ చెల్లింపుల వ్యవస్థలో మార్పులకు సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. BRICS దేశాల మధ్య డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించి, స్థానిక కరెన్సీల్లో లావాదేవీలను సులభతరం చేసేందుకు క్రాస్ – బోర్డర్ డిజిటల్ పేమెంట్స్, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC)లను అనుసంధానించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రయత్నంలో భారత్‌కు చెందిన UPI మోడల్ కీలకంగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశంలో బ్యాంకు ఖాతాల మధ్య తక్షణ డిజిటల్ చెల్లింపులను UPI ఎంత సులభతరం చేసిందో.. అదే తరహాలో BRICS దేశాల ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్స్‌ను పరస్పరం అనుసంధానం చేయాలనే ఆలోచనపై చర్చ జరుగుతోందని చెబుతున్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే BRICS దేశాల మధ్య జరిగే లావాదేవీల్లో ప్రతిసారీ డాలర్‌ను కరెన్సీగా ఉపయోగించాల్సిన అవసరం తగ్గే అవకాశం ఉంది. BRICS దేశాల ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్స్‌ను అనుసంధానం చేయడం, CBDCల మధ్య ఇంటర్‌ఆపరబిలిటీ వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నట్లు RBI కూడా ధృవీకరించినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఏదైనా ఒక నిర్దిష్ట మోడల్‌ను తుది నిర్ణయంగా ఖరారు చేయలేదు.

కొత్త BRICS కరెన్సీ కాదు.. ముందుగా పేమెంట్ కనెక్టివిటీ

BRICSలో డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించే చర్చలు జరిగినప్పుడల్లా.. కొత్తగా ఒక BRICS కరెన్సీ తీసుకురాబోతున్నారనే ప్రచారం వినిపిస్తుంటుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నం దానికి భిన్నంగా ఉంది. కొత్త ఉమ్మడి కరెన్సీని ప్రవేశపెట్టడం కంటే.. ఇప్పటికే ఉన్న సభ్య దేశాల కరెన్సీలు, డిజిటల్ పేమెంట్ వ్యవస్థలను పరస్పరం అనుసంధానం చేయడమే ప్రస్తుత లక్ష్యంగా కనిపిస్తోంది. అంటే భారత్ – రష్యా వంటి దేశాల మధ్య రూపాయి – రూబుల్‌లోనే లావాదేవీలు జరిపే అవకాశం పెంచడంతో పాటు.. వాటి సెటిల్‌మెంట్ కోసం మెరుగైన డిజిటల్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం ప్రధాన ఉద్దేశం. BRICSలో స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం, చెల్లింపులను పెంచాలని భారత్ ఇప్పటికే పలుమార్లు ప్రతిపాదించింది. ఇప్పుడు డిజిటల్ పేమెంట్ కనెక్టివిటీ ఆ వ్యూహానికి తదుపరి అడుగుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.

భారత వ్యాపారులకు భారీ ప్రయోజనం..
ఈ విధానం అమల్లోకి వస్తే BRICS దేశాలతో వ్యాపారం చేసే భారతీయ కంపెనీలకు పేమెంట్స్ మరింత వేగంగా, తక్కువ ఖర్చుతో జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే సమయంలో అంతర్జాతీయ లావాదేవీల్లో రూపాయి వినియోగాన్ని పెంచాలనే భారత్ ప్రయత్నాలకు కూడా ఇది ఊతమివ్వొచ్చని అంటున్నారు. భారత్ ఇప్పటికే తన UPI వ్యవస్థను ఇతర దేశాల డిజిటల్ పేమెంట్ నెట్‌వర్క్‌లతో అనుసంధానం చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో BRICSలో పేమెంట్ ఇంటర్‌ఆపరబిలిటీ ఏర్పాటైతే.. భారత డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సామర్థ్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పే అవకాశం లభిస్తుందని అంటున్నారు. అయితే BRICS దేశాలన్నింటినీ ఒకే పేమెంట్ నెట్‌వర్క్‌లోకి తీసుకురావడం అంత సులభమైన విషయం కాదని సమాచారం. సభ్య దేశాల బ్యాంకింగ్ వ్యవస్థలు, కరెన్సీలు, నిబంధనలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు పరస్పరం భిన్నంగా ఉన్నాయి. కరెన్సీ రిస్క్, లిక్విడిటీ, సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రొటెక్షన్, ఆర్థిక నేరాల నియంత్రణ వంటి అంశాలపై కూడా సమగ్ర విధానం అవసరం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా చైనా వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థకు ప్రత్యేకమైన డిజిటల్ పేమెంట్, ఫైనాన్షియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండటంతో.. డేటా భద్రత, సైబర్ సెక్యూరిటీ, వ్యవస్థల అనుసంధానం వంటి అంశాలు ఇందులో కీలకంగా మారనున్నాయి. అందుకే BRICS లక్ష్యం డాలర్‌ను పూర్తిగా అంతం చేయడమేనని చెప్పడం ప్రస్తుతానికి సరైనది కాదనే వాదనలు ముందుకు వస్తున్నాయి. డాలర్ అవసరం లేకుండానే దేశాల మధ్య చెల్లింపులు జరిపే ప్రత్యామ్నాయ మార్గాలను సృష్టించడం ప్రస్తుతం మరింత ఆచరణాత్మకమైన లక్ష్యంగా కనిపిస్తోందని అంటున్నారు. మొత్తంగా భారత్‌లో జరిగే BRICS సదస్సులో ఈ దిశగా కీలక పురోగతి సాధిస్తే.. అది కేవలం సభ్య దేశాల మధ్య చెల్లింపుల వ్యవస్థలో మార్పుకే పరిమితం కాకుండా, భారత UPI మోడల్‌కు ప్రపంచ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడంతో పాటు రూపాయి అంతర్జాతీయ వినియోగానికి కూడా కొత్త అవకాశాలను తెరవొచ్చని చెబుతున్నారు.