NTV Telugu Site icon

Blinkit: బ్లింకిట్‌ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై ఈఎంఐ ఆప్షన్!

Blinkit

Blinkit

జొమాటో యాజమాన్యంలోని బ్లింకిట్‌ తన వినియోగదారుల కోసం ఈఎంఐ చెల్లింపు సౌకర్యాన్ని గురువారం ప్రారంభించింది. రూ.2,999 కంటే ఎక్కువ ఆర్డర్‌లకు ఈఎంఐ సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. బ్లింకిట్‌ సీఈవో అల్బీందర్‌ దిండ్సా ఎక్స్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. బ్లింకిట్‌లో రూ.2,999 కంటే ఎక్కువ కొనుగోలు చేసే వారు ఈఎంఐ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని దిండ్సా పేర్కొన్నారు. బంగారం, వెండి కొనుగోళ్లకు మాత్రం ఇది వర్తించదని స్పష్టం చేశారు.

ఏ బ్యాంకులు అంటే..
బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులు కలిగిన వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. తొలుత ఉత్పత్తులను కార్ట్‌లో యాడ్‌ చేశాక.. చెక్‌ఔట్‌ సమయంలో ఈఎంఐ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. చెల్లింపు పూర్తయ్యాక ఆ మొత్తం ఈఎంఐగా బ్యాంక్‌ కన్వర్ట్‌ చేస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, సిటీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులు కలిగిన వారు ఈఎంఐ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. 3, 6, 9 నెలలు.. ఇలా వివిధ కాల వ్యవధులను ఎంచుకోవచ్చు. బ్యాంకును బట్టి వడ్డీ రేటు ఉంటుంది.

ఇది కూడా చదవండి: Singareni: సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్..

ఇక బ్లింకిట్ నిర్ణయంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే.. ఇంకొందరు కిరాణా సరుకులు వాయిదాల రూపంలో కొనుగోలు చేసే పరిస్థితులు వచ్చాయంటూ విమర్శించారు.