Adani Group: అదానీ గ్రూప్ మరో భారీ డీల్ను సొంతం చేసుకుంది. దివాలా తీసిన జీవీకే ఎనర్జీ లిమిటెడ్ను (GVK Energy Ltd) బిడ్ ద్వారా కైవసం చేసుకున్నట్లు అదానీ పవర్ తాజాగా ప్రకటించింది. ఈ కొనుగోలు ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో వెల్లడించింది.
100% వాటా అదానీ పవర్ సొంతం
జీవీకే ఎనర్జీలో 100 శాతం వాటాను – యాజమాన్య హక్కులను అదానీ పవర్ లిమిటెడ్ దక్కించుకుంది. మే 12న సీసీఐ ఈ కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపింది. భారీ అప్పుల కారణంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జీవీకే ఎనర్జీ, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (IBC) కింద దివాలా పరిష్కార ప్రక్రియను (CIRP) ఎదుర్కొంటోంది. ఈ వేలంలో అదానీ పవర్ ఆ కంపెనీని స్వాధీనం చేసుకుంది. ఈ ఒప్పందం అదానీ గ్రూప్కు వ్యూహాత్మకంగా చాలా కీలకం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జీవీకే ఎనర్జీకి చెందిన అనుబంధ సంస్థ (AHPL) ద్వారా ఉత్తరాఖండ్లోని శ్రీనగర్లో 330 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్ట్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ప్రధానంగా బొగ్గు ఆధారిత (థర్మల్) విద్యుత్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న అదానీ పవర్, ఇప్పుడు ఈ జలవిద్యుత్ ప్రాజెక్టు ద్వారా క్లీన్ ఎనర్జీ రంగంలో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకోనుందని తెలుస్తుంది.
జీవీకే ఎనర్జీ ప్రస్థానం..
జీవీకే పవర్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు అనుబంధ సంస్థగా ఉన్న జీవీకే ఎనర్జీ, గత ఏడాది మే 6, 2025న కార్పొరేట్ దివాలా ప్రక్రియలోకి ప్రవేశించింది. అప్పులను తీర్చలేని స్థితిలో ఉన్న ఈ కంపెనీని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన వేలంలో అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. గతంలోనూ అదానీ గ్రూప్ దివాలా తీసిన జేపీ అసోసియేట్స్ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ విద్యుత్ ఉత్పాదక సంస్థల్లో అదానీ పవర్ ఒకటి. ప్రస్తుతం ఈ కంపెనీకి గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో థర్మల్ ప్లాంట్లు ఉన్నాయి. సుమారు రూ.86 వేల కోట్ల మార్కెట్ క్యాప్ కలిగిన ఈ సంస్థ, తాజా జలవిద్యుత్ ప్రాజెక్టుతో తన పోర్ట్ఫోలియోను మరింత వైవిధ్యంగా మార్చుకుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో అదానీ గ్రూప్ ఉత్తరాఖండ్ విద్యుత్ రంగంలో తన ఆధిపత్యాన్ని చాటుకోనుంది.
