Krishna Janmashtami : కృష్ణాష్టమి రోజు ఈ మంత్రాలు జపిస్తే.. కృష్ణుడి అనుగ్రహం..!

  • 108 సార్లు జపించాల్సిన మంత్రం
  • కష్టాలు తొలగించే ద్వాదశాక్షరీ మంత్రం
  • జాగరణలో ఈ శ్లోకం ప్రత్యేకం
  • తులసి మాలతో జపిస్తే శుభఫలాలు
Krishna

Krishna

Krishna Janmashtami : భాద్రపద మాసంలో వచ్చే కృష్ణాష్టమి పండగకు హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది. కంసుని చెరసాలలో వసుదేవుడు, దేవకిల అష్టమ గర్భంలో శ్రీకృష్ణుడు జన్మించిన పవిత్ర రాత్రిని భక్తులు కృష్ణాష్టమిగా అపారమైన భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ముఖ్యంగా మధుర, గోకుల, బృందావనాలలో భక్తులు రోజంతా ఉపవాసం ఉండి, అర్ధరాత్రి వరకు జాగరణ చేస్తారు. శంఖారావాలు, గంటల శబ్దాలు, వేదమంత్రాలు , భజనల నడుమ బాలకృష్ణుడిని ఆరాధిస్తారు. ఈ పవిత్రమైన రోజున శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందడానికి , కలియుగంలో కష్టాల నుండి ఉపశమనం పొందడానికి జపించాల్సిన కొన్ని ముఖ్యమైన మంత్రాలు విశేష ఫలాన్ని ఇస్తాయి.

హరే కృష్ణ మహా మంత్రం , పంచతత్వ మంత్రం

కృష్ణాష్టమి రోజున తులసి మాలను చేతిలో పట్టుకుని ‘హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే.. హరే రామ హరే రామ రామ రామ హరే హరే’ అనే మహా మంత్రాన్ని 108 సార్లు లేదా కనీసం 16 సార్లు జపించడం ఎంతో శ్రేయస్కరం. ఉపనిషత్తుల ప్రకారం కలియుగంలో ఎదురయ్యే సకల కష్టాలు, మానసిక అలజడుల నుంచి బయటపడటానికి ఈ మహా మంత్రం ఒక సులువైన మార్గం. ఇక ఏదైనా భక్తి కార్యక్రమం లేదా జపం ప్రారంభించే ముందు ‘జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద.. శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త బృందా’ అనే పంచతత్వ మంత్రాన్ని పఠించడం విశేష ఫలాన్ని ఇస్తుంది. మహా మంత్రాన్ని ప్రారంభించే ముందు పంచభూతాల నామాలను జపిస్తూ వాటికి నమస్కరించడం ద్వారా ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుంది.

ద్వాదశాక్షరీ మంత్రం , బ్రహ్మ సంహిత శ్లోకం

శ్రీకృష్ణునికి అంకితం చేయబడిన ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రంలో మొత్తం 12 అక్షరాలు ఉంటాయి, అందుకే దీనిని ‘ద్వాదశాక్షర మంత్రం’ అని పిలుస్తారు. పూజా సమయంలో శ్రీకృష్ణుని చిత్రపటం ముందు కూర్చుని, స్వామివారికి పుష్పాలను సమర్పిస్తూ తులసి మాలతో ఈ మంత్రాన్ని జపించడం వల్ల భక్తుల కష్టాలు తొలగిపోయి, కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. అలాగే సృష్టి కార్యాన్ని చేపట్టే ముందు బ్రహ్మదేవుడు శ్రీమహావిష్ణువును స్తుతిస్తూ చెప్పిన ‘ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహః.. అనాదిర్గోవిందః సర్వకరణకరణం’ అనే శ్లోకాన్ని కృష్ణాష్టమి జాగరణ సమయంలో , అర్ధరాత్రి స్వామివారి అభిషేకానికి ముందు పఠిస్తారు. ఈ పవిత్ర మంత్రాలను భక్తితో స్మరించడం వల్ల మనస్సు నిర్మలంగా మారి దైవానుగ్రహం సిద్ధిస్తుంది.