YS Jagan Pulivendula Visit: పులివెందులకు వైఎస్‌ జగన్‌.. నేడు ప్రజాదర్బార్, రేపు వైఎస్సార్‌కు నివాళి

Ys Jagan

Ys Jagan

YS Jagan Pulivendula Visit: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నేడు పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహించనున్న ఆయన, రేపు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని నివాళులర్పించనున్నారు.

షెడ్యూల్ ప్రకారం, నేడు ఉదయం 11.30 గంటలకు జగన్ పులివెందుల చేరుకుంటారు. అనంతరం భాకరాపురంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. కార్యక్రమం అనంతరం పులివెందులలోనే రాత్రికి బస చేయనున్నారు. ఇక, రేపు ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి ఉదయం 7.30 గంటలకు ఇడుపులపాయ చేరుకోనున్నారు. అక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని నివాళులర్పిస్తారు. అనంతరం కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. కాగా, తన సొంత నియోజకవర్గానికి వెళ్లిన ప్రతీసారి వైఎస్‌ జగన్‌.. ప్రజా దర్బార్‌ నిర్వహించి.. ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడం.. వారి నుంచి వినతిపత్రాలు స్వీకరించడం జరుగుతున్న విషయం విదితమే..