VijayaSaiReddy: గుంటనక్కలను చంద్రబాబు ఉసిగొల్పుతున్నాడు

సోషల్ మీడియాలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, నిర్మాత బండ్ల గణేష్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. తాజాగా బండ్ల గణేష్‌ను ఉద్దేశిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఆరోపణలు చేశారు. ఉన్నత స్థానాల్లో ఉన్న వారిని తిట్టేంచేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు గుంట నక్కలను ఉసిగొల్పుతున్నాడని ఆరోపించారు. ఆ గుంట నక్కలను ఊళలకు సంబరపడే నార్సిసిస్టిక్ జబ్బు చంద్రబాబుకి జిగురులా పట్టుకుందని విమర్శించారు.

అభద్రతా భావాన్ని ఎగదోసి బుసలు కొట్టించడం, ఓటమిని గెలుపు అనుకోవడం ఈ జబ్బు లక్షణంగా ఉంటుందని విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. వృద్ధాప్యంలో ఇదో దీనావస్థ అని చంద్రబాబును ఉద్దేశించి ఎద్దేవా చేశారు. మరోవైపు తిరుపతిలో జాబ్ మేళా రెండో రోజు కూడా విజయవంతంగా కొనసాగుతోందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. రాయలసీమలోని నలుమూలల నుంచి ఉద్యోగార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని తెలిపారు. వారికి వివిధ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నట్లు పేర్కొన్నారు.