NTV Telugu Site icon

CM Chandrababu: నేడు వరద నష్టంపై కేంద్రానికి నివేదిక పంపిస్తాం.. 80వేల మందికి నిత్యావసరాల కిట్‌!

Cbn

Cbn

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన వరద నష్టంపై ఇవాళ (శుక్రవారం) సాయంత్రంలోగా కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. బుడమేరు గండి పూడ్చివేతలో సైన్యం సాయం తీసుకుంటున్నామని చెప్పారు. ఇళ్లు శుభ్రం చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి అగ్నిమాపక యంత్రాలు తెప్పిస్తున్నాం.. ఆన్‌లైన్‌ ద్వారా నిర్ణీత ధరలకే ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మెకానిక్‌ల సేవలు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు చెప్పారు. నేటి నుంచి నిత్యావసరాలతో పాటు కుటుంబానికి మూడు ప్యాకెట్ల నూడుల్స్, యాపిల్స్, పాలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే, ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సెప్టెంబరు నెల విద్యుత్తు బిల్లుల వసూలు వాయిదా వేస్తున్నట్లు కూడా పేర్కొన్నారు.

Read Also: FIR On Teacher: చెవిపై కొట్టడంతో వినికిడిని కోల్పోయిన విద్యార్థి.. ఉపాధ్యాయుడిపై ఎఫ్‌ఐఆర్‌..

ఇక, ముంపు ప్రాంతాల్లో వివిధ పనులకు ఇష్టానుసారం వసూళ్లు చేయకుండా ఒకే ధర నిర్ణయిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే, ఈరోజు నుంచి అందరికి మూడు రోజుల్లో నిత్యావసరాల సరఫరా పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. తొలిరోజైన నేడు 80 వేల మందికి నిత్యావసరాల కిట్‌ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. రాయితీపై కూరగాయల సరఫరా కొనసాగిస్తామని పేర్కొన్నారు. అయితే, ఇప్పటి వరకు బుడమేరుకు రెండు గండ్లు పూడ్చాం.. నగరంలోకి నీరు రాకుండా చేసేందుకు మూడో గండిని కూడా పూడ్చే పనులు కొనసాగుతున్నాయి.. బుడమేరు గండ్లు పూడ్చేందుకు కేంద్రం నుంచి మిలటరీ ఇంజినీరింగ్‌ బృందం ఆధ్వర్యంలో నేటి నుంచి పనులు జరుగుతాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు.