అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ సంక్షోభం ఇప్పుడు నేరుగా సామాన్యుడి సొంతింటి కలపై ప్రభావం చూపుతోంది. పశ్చిమాసియాలో (Middle East) ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల వల్ల సరఫరా వ్యవస్థలు దెబ్బతిని, నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ముఖ్యంగా విశాఖపట్నం వంటి నగరాల్లో గ్యాస్ ఆధారిత సిరామిక్ , యూపీవీసీ (uPVC) పరిశ్రమలు మూతపడుతున్నాయి. దీని ఫలితంగా బిల్డింగ్ మెటీరియల్స్ ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుతున్నాయి.
భారతదేశంలో తయారయ్యే సిరామిక్ ఉత్పత్తుల్లో సుమారు 90 శాతం గుజరాత్లోనే ఉత్పత్తి అవుతాయి. ఈ పరిశ్రమలకు గ్యాస్ , క్రూడ్ ఆయిల్ అత్యంత కీలకం. యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు పెరగడం, సరఫరా తగ్గడంతో తయారీ వ్యయం భారీగా పెరిగింది. ముడిసరుకు కొరత , పెరిగిన ఖర్చుల భారాన్ని భరించలేక చాలా ఫ్యాక్టరీలు ఏప్రిల్ 1వ తేదీ నుండి తమ ఉత్పత్తిని నిలిపివేశాయి. మరికొన్ని చోట్ల ఉత్పత్తి 50 శాతానికి పడిపోయింది.
తయారీ ఖర్చులు పెరగడంతో డీలర్లు , తయారీదారులు వస్తువుల ధరలను భారీగా పెంచేశారు. టైల్స్, కమోడ్లు, వాష్ బేసిన్లు , ఇతర శానిటరీ వస్తువుల ధరలు 20% నుండి 30% వరకు పెరిగాయి. కొన్ని రకాల వస్తువులపై ఏకంగా 50% వరకు భారం పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
Rini Sampath: వాషింగ్టన్ గడ్డపై చరిత్ర సృష్టించనున్న ఇండియన్ లేడీ.. ఎవరీ రిని సంపత్?
ధరలు అమాంతం పెరగడంతో కస్టమర్లు షాపులకు రావడం తగ్గించేశారు. వచ్చిన వారు కూడా పాత ధరలకు, కొత్త ధరలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూసి వెనుదిరుగుతున్నారు. దీనివల్ల హార్డ్వేర్ , శానిటరీ వ్యాపారం పూర్తిగా మందగించిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిర్మాణ వ్యయం రెట్టింపు అవ్వడంతో బిల్డర్లు తమ ప్రాజెక్టులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. ప్లంబింగ్ , ఇతర ఫినిషింగ్ పనులను వాయిదా వేస్తున్నారు. దీనివల్ల వేలాది మంది ప్లంబర్లు, నిర్మాణ కార్మికులు , రోజువారీ కూలీలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారు. హైదరాబాద్ తర్వాత నిర్మాణ రంగంలో రెండో అతిపెద్ద మార్కెట్ అయిన విశాఖపట్నంలో ఈ ప్రభావం అత్యంత తీవ్రంగా కనిపిస్తోంది.
యుద్ధం ఎక్కడో జరుగుతున్నా, దాని ప్రభావం మాత్రం ఇక్కడి సామాన్యుడి బడ్జెట్ను తలకిందులు చేస్తోంది. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇంధన ధరలను నియంత్రించకపోతే లేదా అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గకపోతే నిర్మాణ రంగం మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
