YS.Jagan: కూటమి సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది.. విశాఖ మేయర్‌ అంశంపై జగన్ ధ్వజం

  • ఏపీలో కూటమి సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది
  • విశాఖ మేయర్‌ అంశంపై జగన్ ధ్వజం
Ysjagan

Ysjagan

ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్.జగన్ ధ్వజమెత్తారు. విశాఖ మేయర్‌ అవిశ్వాస తీర్మానంపై ఎక్స్ ట్విట్టర్ వేదికగా జగన్ స్పందించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ గూండాయిజం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్‌ పదవి నుంచి బీసీ మహిళను దించేయడం.. కూటమి సర్కార్ చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం అని పేర్కొన్నారు.

ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 98 డివిజన్లు ఉన్న విశాఖ కార్పొరేషన్‌లో 58 స్థానాలను వైసీపీ గెలిచిందని గుర్తుచేశారు. టీడీపీ కేవలం 30 సీట్లు మాత్రమే గెలిచిందన్నారు. ఈ లెక్కల ప్రకారం మేయర్ పదవి కూటమి ప్రభుత్వానికి ఎలా వస్తుందని ప్రశ్నించారు. బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ యాదవ కులానికి చెందిన మహిళను మేయర్ సీటులో కూర్చోబెడితే కోట్లాది రూపాయలతో ప్రలోభపెట్టి మేయర్ పదవిని లాక్కున్నారని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యం అంటారా? అవిశ్వాసం ప్రక్రియ స్వేచ్ఛగా జరిగిందని అనుకోవాలని అంటారా? అధికార దుర్వినియోగం కాదా ఇది? అని ప్రశ్నించారు.