CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..

  • రేపు విశాఖకు సీఎం చంద్రబాబు పర్యటన..
  • సీఫుడ్ ఎక్స్ పోర్ట్స్ ఎగుమతులపై సదస్సుకు హాజరు..
  • విశాఖ ఎకనమిక్ రీజియన్‌పై అధికారులతో సమీక్ష..
  • ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై ప్రయాణించనున్న సీఎం
Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu Vizag Tour: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం రోజు విశాఖపట్నంలో పర్యటించనున్నారు.. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై విశాఖలో నిర్వహించే జాతీయ సదస్సుకు హాజరు కానున్నారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఉదయం 8.30 గంటలకు ముఖ్యమంత్రి విశాఖకు బయల్దేరనున్నారు. 10 గంటలకు విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజి గ్రౌండ్స్ కు చేరుకుని ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెట్ జీరో కార్యక్రమంలో భాగంగా ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం వద్ద మొక్కను నాటుతారు. అనంతరం సైకిల్ పై ప్రయాణించి బీచ్ రోడ్ లోని నోవాటెల్ హోటల్ లో జరుగనున్న నేషనల్ సీ ఫుడ్ ఎక్స్ పోర్ట్స్ వర్క్ షాప్ కు సీఎం హాజరవుతారు. ఈ సదస్సుకు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, చిరాగ్ పాశ్వాన్, రాజీవ్ రంజన్ సింగ్, జార్జ్ కురియన్, ఎస్పీ సింగ్ భగేల్ తదితరులు హాజరు కానున్నారు. ఆక్వా కల్చర్, మత్స్య రంగంలో స్టార్టప్ లు, సీఫుడ్ ఎక్స్ పోర్టు అసోసియేషన్లు, మెరైన్ ఆక్వా కల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు సంబంధించిన వివిధ భాగస్వాములు ఈ వర్క్ షాప్ కు హాజరు కానున్నారు.

సమావేశంలో సముద్ర ఆహార ఎగుమతుల ప్రస్తుత పరిస్థితులు, వివిధ ప్రత్యామ్నాయ మార్కెట్లు, మెరైన్ ఫిషరీస్ లో అవకాశాలు, మత్స్యరంగ అభివృద్ధి తదితర అంశాలతో పాటు యూరోపియన్ యూనియన్ సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు ఆక్వా ఉత్పత్తులను ఎగుమతి చేసే అంశాలపై చర్చించనున్నారు. అలాగే ట్రేసబిలిటీ వ్యవస్థలను బలోపేతం చేయడం, ఆక్వా కల్చర్ లో సర్టిఫికేషన్ లాంటి స్థిరమైన విధానాలకు ప్రోత్సాహం కల్పించటం లాంటి అంశాలపై చర్చ జరుగనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రాజెక్టు లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా విలువ జోడించిన ఉత్పత్తులు, ఎంఎస్ఎంఈలకు మద్దతు కల్పించే అంశాన్ని కూడా ఈ వర్క్ షాప్ ద్వారా వివరించే అవకాశం ఉంది. డీప్ సీ సహా అండమాన్ నికోబార్, లక్ష ద్వీప్ లాంటి ప్రాంతాల్లో అధిక విలువ కలిగిన మెరైన్ ఉత్పత్తుల వినియోగం, సీవీడ్, ఆర్నమెంటల్ ఫిష్, ముత్యాల పెంపకం లాంటి రంగాల అభివృద్ధి తదితర అంశాలపై ఈ వర్క్ షాప్ లో విస్తృతంగా చర్చించనున్నారు. పీఎంకేఎస్‌ఎస్‌వై (PMKSSY), కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకాల లబ్ధిదారులకు ప్రోత్సాహకాలను అందించనున్నారు. అనంతరం విశాఖ ఎకనామిక్ రీజియన్ పై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సమీక్ష అనంతరం సాయంత్రం అమరావతికి తిరిగి ప్రయాణం అవుతారు.

×
×
Ad