Andhra Pradesh: తనిఖీల ఎఫెక్ట్.. దిగొస్తున్న సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు..!

  • ఏపీలో సినిమా థియేటర్లలో తనిఖీలు..
  • స్పష్టంగా కనిపిస్తోన్న తనిఖీల ఎఫెక్ట్..
  • దిగివస్తున్న సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు..
Cinema Theaters

Cinema Theaters

Andhra Pradesh: థియేటర్‌ బంద్‌ పిలుపు వివాదం.. థియేటర్లను, మల్టీప్లెక్స్‌లను గట్టిగానే తాకింది.. జూన్‌ 1వ తేదీ నుంచి సినిమా థియేటర్ల మూత అనే నిర్ణయంపై పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించడం.. టాలీవుడ్‌ పెద్దలు సైతం రంగంలోకి దిగడంతో.. ఇప్పట్లో థియేటర్ల బంద్‌ ఉండదు అనేదానిపై క్లారిటీ వచ్చింది.. అయితే, ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీసుల యంత్రాంగం రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో తనిఖీలు చేపట్టింది.. థియేటర్ల నిర్వహణతో పాటు తినుబండారాల అమ్మకాలు, వాటి రేట్లపై ఆరా తీశారు.. అయితే, సినిమా థియేటర్లపై తనిఖీల ఎఫెక్ట్ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు.. ప్రభుత్వ తనిఖీల ఎఫెక్ట్‌తో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు దిగివస్తున్నాయి..

Read Also: Deputy CM Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలపై పవన్ కల్యాణ్‌ ప్రత్యేక సర్వే..!

ఇప్పుడు సినిమా థియేటర్లతో పాటు, మల్టీప్లెక్స్‌లు ఆహార పదార్థాల ధరలపై 10 శాతం నుండి 20 శాతం వరకు డిస్కౌంట్‌ ప్రకటించి విక్రయాలు సాగిస్తున్నాయట.. అంతేకాదు.. బై వన్.. గెట్ వన్.. ఆఫర్లతో వినియోగదారులను తినుబండారాలు విక్రయిస్తున్నారు.. నిన్న, మొన్న వరుసగా రెండు రోజులు థియేటర్లలో తనిఖీలు చేపట్టారు అధికారులు.. టికెట్ ధరలు, ఆహార పదార్థాల క్వాలిటీ, ధరలు పెంపుపై వచ్చిన ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకుని ఈ సోదాలు నిర్వహించారు.. మిరజ్ సినిమాస్ మల్టీప్లెక్స్ లలో లార్జ్ సైజ్ పాప్కాన్ బకెట్ 750 రూపాయలకు అమ్ముతున్నట్లు గుర్తించారు.. ఇష్టానుసారంగా అధిక ధరలకు అమ్ముతున్న థియేటర్లను నోటీసులు ఇచ్చారట.. ధరలపై నియంత్రణ లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.. దీంతో, అసలుకే ఎసరు వచ్చేలా ఉందని గ్రహించిన సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల యాజమాన్యాలు.. ఇప్పుడు ధరలను తగ్గించి అమ్మకాలు సాగిస్తున్నారు.. అయితే, ఇది ఇప్పుడు విశాఖకే పరిమితం అయ్యిందా..? రాష్ట్రవ్యాప్తంగా తనిఖీల ప్రభావం కనిపిస్తుందా? అనే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..