CM Chandrababu: సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ఒకరు సేఫ్.. రంగంలోకి సీఎం చంద్రబాబు..!

  • సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ఒకరు సేఫ్
  • సీఎం చంద్రబాబు సమీక్ష
  • గాలింపును మరింత ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు
Chandrababu

Chandrababu

Visakhapatnam Fishermen Missing: విశాఖ సముద్రతీరంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. గల్లంతైన బోటులో ఒకరు సేఫ్ గా బయటపడ్డారు. బోటు ఓనర్ చిన్నయ్యను షిప్ సిబ్బంది కాపాడారు. గల్లంతైన మిగితా ఆరుగురి ఆచూకీ కోసం కోస్ట్‌గార్డ్ గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. మత్స్యకారుల ఆచూకీ కోసం ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత స్వయంగా అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.

సీఎం చంద్రబాబు సమీక్ష

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడి గాలింపు చర్యలను సమీక్షించారు. మత్స్యకారులను రక్షించేందుకు ఇప్పటివరకు చేపట్టిన చర్యలపై అధికారులు సీఎంకు వివరించారు. కోస్ట్ గార్డ్ నౌకలతో గాలింపును మరింత ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే నేవీ హెలికాప్టర్ల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్‌ను విస్తరించినట్లు అధికారులు తెలిపారు.

సముద్రంలో జరుగుతున్న గాలింపు చర్యలను సమన్వయం చేసుకోవాలని మెరైన్ ఐజీపీ, విశాఖ పోలీస్ కమిషనర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. గాలింపు పురోగతిపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందించాలని సూచించారు.

హోంమంత్రి అనిత ఆరా

ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత వెంటనే స్పందించారు. విశాఖ జిల్లా కలెక్టర్, ఎస్పీ, మత్స్యశాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. గల్లంతైన మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్ నౌకలతో గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సూచిస్తూ, మత్స్యకారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి గల్లంతైన మత్స్యకారుల వివరాలు, ప్రస్తుతం కొనసాగుతున్న గాలింపు చర్యలపై సమాచారం సేకరించారు. ఈ నెల 1వ తేదీన చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు తుపాను హెచ్చరికల నేపథ్యంలో తిరుగు ప్రయాణం ప్రారంభించినప్పటికీ, తీరానికి చేరుకునే సమయంలో వారి ఆచూకీ గల్లంతైనట్లు కలెక్టర్ పవన్ కల్యాణ్‌కు వివరించారు.

దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్, మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డ్, భారత నేవీ సమన్వయంతో విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే నేవీ హెలికాప్టర్‌తో గాలింపు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పూర్తి సమాచారం అందించాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. గల్లంతైన మత్స్యకారులను క్షేమంగా రక్షించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని, కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.

కొనసాగుతున్న గాలింపు

ప్రస్తుతం కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు, భారత నేవీ సంయుక్తంగా సముద్రంలో విస్తృతంగా గాలింపు కొనసాగిస్తున్నారు. గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం నౌకలు, హెలికాప్టర్ల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇక మత్స్యకారుల కుటుంబ సభ్యులు తమ వారు క్షేమంగా తిరిగి రావాలని ఆశగా ఎదురుచూస్తుండగా, ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలను వేగవంతం చేసింది. ప్రస్తుతం వారి ఆచూకీ కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోంది.