Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్‌షీట్‌ దాఖలు.. 25 మందిపై అభియోగాలు

Ap Fake Liquor Case

Ap Fake Liquor Case

Fake Liquor Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన నకిలీ మద్యం కేసులో సిట్ మరియు ఎక్సైజ్ అధికారులు కీలక ముందడుగు వేశారు. ఈ కేసుకు సంబంధించి సుమారు 1300 పేజీలతో కూడిన చార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేశారు. ఈ చార్జ్‌షీట్‌లో మొత్తం 25 మందిపై అభియోగాలు మోపగా, 89 మందిని సాక్షులుగా చేర్చారు.. ఇక, దర్యాప్తులో భాగంగా సేకరించిన ఆధారాలు, సాక్ష్యాలు, ఆర్థిక లావాదేవీల వివరాలు మరియు నకిలీ మద్యం తయారీకి సంబంధించిన కీలక అంశాలను సిట్ అధికారులు చార్జ్‌షీట్‌లో పొందుపరిచినట్లుగా తెలుస్తోంది..

ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న జనార్ధన్‌రావు, మాజీ మంత్రి జోగి రమేష్ సహకారంతోనే కల్తీ మద్యం తయారీ చేపట్టినట్లు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. నకిలీ మద్యం తయారీ మరియు సరఫరా ద్వారా భారీగా అక్రమ లాభాలు పొందినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే జనార్ధన్‌రావుతో కలిసి పనిచేయడం ద్వారా జోగి రమేష్ కూడా రాజకీయ మరియు ఆర్థిక లబ్ధి పొందినట్లు సిట్ ఎక్సైజ్ అధికారులు చార్జ్‌షీట్‌లో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ కేసులో మరికొంతమంది కీలక వ్యక్తుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు పేర్కొంటున్నారు. నకిలీ మద్యం వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారగా, ఈ కేసులో సిట్ దాఖలు చేసిన విస్తృత చార్జ్‌షీట్ రాజకీయ వర్గాల్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. కేసు తదుపరి విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.

ఇక, నకిలీ మద్యం తయారీ కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ తో పాటు ఆయన సోదరుడు జోగి రాము కూడా అరెస్ట్‌ అయిన విషయం విదితమే.. ములకలచెరువు నకిలీ మద్యం కేసులో అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె జూనియర్‌ సివిల్‌ కోర్టు వారికి బెయిల్‌ రావడంతో.. 83 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు జోగి బ్రదర్స్‌.. గత ఏడాది అక్టోబర్‌ 3న ఎక్సైజ్‌ పోలీసులు నకిలీ మద్యం గుట్టు రట్టు చేశారు. ఇక్కడ తీగ లాగితే ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో కూడా డొంక కదలడంతో అక్కడ కూడా నకిలీ మద్యం తయారీ యూనిట్‌పై దాడులు చేసి సోదాలు నిర్వహించారు.. ఈ 2 కేసుల్లోనూ కీలక నిందితుడిగా ఉన్న జనార్దనరావు(ఏ1) వాంగ్మూలంతో నవంబర్‌ 2వ తేదీన జోగి సోదరులను అరెస్ట్ చేసిన విషయం విదితమే..