Swachh Andhra Awards 2025: స్వచ్ఛ ఆంధ్ర-2025 అవార్డులు ప్రదానం చేసేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇవాళ సాయంత్రం విజయవాడలో స్వచ్ఛ ఆంధ్ర 2025 అవార్డులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రదానం చేయనున్నారు.. మొత్తం 21 కేటగిరీల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో అవార్డులను ఇప్పటికే ప్రకటించింది స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్.. రాష్ట్ర స్థాయిలో 69 అవార్డులు, జిల్లా స్థాయిలో 1,257 అవార్డులు అందజేయనున్నారు.. స్వచ్ఛత కార్యక్రమాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన మున్సిపాలిటీలకు కేంద్రం ఇస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల తరహాలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు ఇస్తున్నారు.. స్వచ్ఛ మునిసిపాలిటీలు, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు, స్వచ్ఛ స్కూల్స్, స్వచ్ఛ ఆసుపత్రులు, స్వచ్ఛ కార్యాలయాలు, స్వచ్ఛ రైతు బజార్లు, స్వచ్ఛ బస్సు స్టేషన్లు, స్వచ్ఛ పరిశ్రమల కేటగిరీల్లో అవార్డులకు ఎంపిక చేశారు.. మూడు దశల్లో వెరిఫికేషన్ తర్వాత పూర్తి డిజిటల్ విధానంలో అవార్డులను ఎంపిక చేశారు..
Read Also: TDP vs YCP: టీడీపీ వర్సెస్ వైసీపీ.. విజయనగరం జిల్లాలో ఉద్రిక్తత..
ఈ సారి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ స్వచ్ఛ జిల్లాగా అనంతపురం తోపాటు 6 మున్సిపాలిటీలు, 6 గ్రామ పంచాయతీలు ఎంపిక చేశారు.. అవార్డులకు ఎంపికైన మునిసిపాలిటీల విషయానికి వస్తే.. మంగళగిరి -తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, తాడిపత్రి, బొబ్బిలి, పలమనేరు, ఆత్మకూరు (నెల్లూరు జిల్లా), కుప్పం ఉన్నాయి.. ఇక, అవార్డులకు ఎంపికైన గ్రామ పంచాయతీలను పరిశీలిస్తే.. చౌడువాడ (అనకాపల్లి జిల్లా), ఆర్.ఎల్.పురం (ప్రకాశం జిల్లా), లోల్ల (కోనసీమ జిల్లా), చల్లపల్లి (కృష్ణా జిల్లా), చెన్నూరు (వైఎస్సార్ కడప జిల్లా), కనమకుల పల్లె (చిత్తూరు జిల్లా) ఉన్నాయి.. అద్భుత ప్రతిభ కనబరిచిన పారిశుధ్య కార్మికులు, గ్రీన్ అంబాసిడర్ లు, స్వయం సహాయక సంఘాలకు కూడా అవార్డులు అందజేయనున్నారు..
