Compensation to Flood Victims: వరద బాధితులకు గుడ్న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ రోజు బాధితుల ఖాతాల్లో సొమ్ములు జమ చేసింది.. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో వరద బాధితులకు పరిహారం పంపిణీలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల సంభవించిన విపత్తులో ప్రభుత్వం వైపు నుంచి ఎంత వరకు సాయం చేయాలో అంత వరకు చేశాం అన్నారు.. నాలుగు లక్షల మందికి రూ. 602 కోట్లు బాధితుల అకౌంట్లలో వేశామని తెలిపారు.. ఇప్పటి వరకు నేను చూడని విపత్తు ఇది. బుడమేరులో ఎప్పుడూ చూడని వరద. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో మోడ్రనైజేషన్ పనులు నిలిపేసింది. బుడమేరు కబ్జాకు గురైంది. మరో వైపు కృష్ణా నదిలో పెద్ద ఎత్తున వరద. ఇది ఆల్ టైమ్ రికార్డ్ గా పేర్కొన్నారు.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
ప్రకృతి ప్రకోపం.. లేదా ప్రకృతితో మనం ఆడుకున్నప్పుడో ఇలాంటి అకాల వరదలు వస్తున్నాయన్నారు సీఎం చంద్రబాబు.. దీనికి తోడు గత పాలకుల పాపాలు కూడా వరద తీవ్రత పెరగడానికి తోడయ్యాయి. వరద సమస్య.పరిష్కారం కాదని.. కలక్టరేట్లోనే మకాం వేశాను. బాధితులు మంచి నీళ్లు అడిగినా ఇవ్వలేని నిస్సహయ స్థితిలో సీఎంగా ఉన్న నేనే ఉండిపోయాను. సింగ్ నగర్ లో పర్యటించిన వెంటనే కేంద్ర పెద్దలతో మాట్లాడాను. వరద ప్రాంతాల్లో రోజుల వారీ తిరిగాను. వీలున్నంత వరకు ప్రాణ నష్టం తగ్గించగలిగాం. ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను బాధితులకు కల్పించాం. 1.15 కోట్ల ఫుడ్ ప్యాకెట్లు, 5 వేల క్వింటాళ్ల కూరగాయలు సరఫరా చేశాం. ఫైరింజన్లతో 75 వేల ఇళ్లను శుభ్రం చేయించాం. 20 వేల మెట్రిక్ టన్నుల చెత్తని తొలగించాం. 2.50 లక్షల కరెంట్ కనెక్షన్లు తక్కువ సమయంలో పునరుద్దరించాం. ఈ అనుభవంతో భవిష్యత్తులో ఎంతటి పెద్ద విపత్తు వచ్చినా ఎదుర్కోగలిగే అనుభవం వచ్చిందని తెలిపారు చంద్రబాబు..
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
రూ. 400 కోట్ల మేర విరాళాలు వచ్చాయి. విరాళాలిచ్చిన దాతలకు పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు సీఎం చంద్రబాబు.. వీల్ ఛైర్లో వచ్చారు.. ఎన్ఆర్ఐలు, చిన్నారులు ముందుకొచ్చి విరాళాలిచ్చారు. చదువుకునే పిల్లలు కూడా సాయం అందించారు. సాటి వారికి సాయపడాలనే తపనతో చిన్నారులు కూడా స్పందించారు. రూ. 6700 కోట్ల నష్టం జరిగిందని.. ప్రభుత్వం రూ. 602 కోట్ల మేర సాయం అందిస్తోందన్నారు. దాతల నుంచే సుమారు రూ. 400 కోట్లు ఇచ్చారు. సంఘటితంగా ఉంటే ఎంతటి విపత్తు అయినా ఎదుర్కొగలమనే నమ్మకాన్ని పెరిగిందన్నారు.. 16 జిల్లాల్లో వరద, వర్ష ప్రభావం ఉంది. అందరికీ ఒకేసారి సాయం అందించామని వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..