ఖరగపూర్-విజయవాడ మధ్య డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌: మంత్రి ప్రహ్లాద్‌ జోషి

ఖరగపూర్‌, విజయవాడ (1,115 కి.మీ), విజయవాడ-నాగపూర్‌(975కి.మీ)ల మధ్య “డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌” నిర్మాణం కోసం రైల్వే శాఖ డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నట్లు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ “నేషనల్‌ మినరల్‌ పాలసీ” కింద “డెడికేటెడ్‌ మినరల్‌ కారిడార్లు” ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.

మైనింగ్‌ చేసే ప్రాంతాల నుంచి ఖనిజాలను ఇతర ప్రాంతాలకు తరలించడానికి ఈ కారిడార్లు ఉపయుక్తంగా ఉంటాయని పేర్కొన్నారు. “మినరల్‌ కారిడార్ల”కు అనుబంధంగా ఖనిజ రవాణా కోసం స్థానికంగా సమగ్రమైన రీతిలో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు ఆయన చెప్పారు.“డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్లు” అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా భారీగా సరుకును తరలించే విధంగా పొడవాటి ట్రైన్ల ద్వారా రవాణా చేసేలా రూపుదిద్దుకుంటాయని మంత్రి చెప్పారు.