తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగానే కాదు విదేశాల నుంచి కూడా భారీ ఎత్తున విరాళాలు అందుతుంటాయి. ఈ నేపథ్యంలో సోమవారం నాడు టీటీడీకి అత్యధిక మొత్తంలో విరాళాలు అందాయి. ఈ మేరకు తిరుమల శ్రీవారికి తమిళనాడుకు చెందిన నలుగురు భక్తులు రూ.10 కోట్ల విరాళాలు అందించారు. ఈ నలుగురు భక్తుల్లో గోపాల బాలకృష్ణన్ అనే భక్తుడు ఏకంగా రూ.7 కోట్ల విరాళం అందజేశాడు.
తిరునల్వేలికి చెందిన గోపాల బాలకృష్ణన్ తిరుమలలో అన్నదానం సహా ఏడు ట్రస్టులకు రూ.కోటి చొప్పున రూ.7 కోట్ల చెక్కును టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశాడు. మరోవైపు A స్టార్ టెస్టింగ్ అండ్ ఇన్స్పెక్షన్ కంపెనీ విద్యాదాన ట్రస్టుకు రూ.కోటి అందజేసింది. అటు బాలకృష్ణ ఫ్యూయల్ స్టేషన్ సంస్థ శ్రీవాణి ట్రస్టుకు రూ.కోటి, సీ హబ్ ఇన్స్పెక్షన్ సర్వీసెస్ సంస్థ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ.కోటి విరాళాన్ని అందించాయి. మొత్తంగా ఒకే రోజు వ్యక్తిగత హోదాల్లో నలుగురు భక్తులు స్వామి వారికి ఏకంగా రూ.10 కోట్ల విరాళాన్ని అందించారు. టీటీడీ చరిత్రలో ఒక్కరోజులో అందిన అత్యధిక విరాళాలు ఇవే కావడం గమనార్హం.