ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న శేషాచలం కొండపై అక్రమ టోల్ వసూలు బాగోతం బట్టబయలైంది. ఏడాదికాలంగా సంబంధిత కాంట్రాక్టర్, కొందరు ఆలయ ఉద్యోగులు టోల్ రుసుముల పేరుతో భక్తులను దోచుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్లోని టోల్ గేట్ వద్ద భక్తుల వాహనాలకు రుసుములు వసూలు చేసుకునే నిమిత్తం 2020 జనవరి 27న దేవస్థానం బహిరంగ వేలం, సీల్ టెండర్లను నిర్వహించింది. ఇందులో ఒక కాంట్రాక్టర్ సీల్ టెండర్ ద్వారా రూ. 1,30,56,777 లకు టోల్ వసూలు చేసుకునే హక్కును కైవసం చేసుకున్నాడు.
Read Also: October Bank Holidays : అక్టోబర్లో 21 రోజులు బ్యాంకులకు సెలవులు
అయితే కరోనా నేపథ్యంలో సదరు కాంట్రాక్టర్ టోల్ నిర్వహణ బాధ్యతలను వెంటనే చేపట్టలేదు. దీంతో 2021 అక్టోబర్ 14 వరకు దేవస్థానమే టోల్ వసూళ్లను సొంతంగా నిర్వహించింది. ఇక టోల్గేట్ ను దేవస్థానమే నిర్వహించాలన్న ఉద్దేశంతో కారు, జీపు, వ్యాను టోల్ ధరను రూ. 30 నుంచి రూ. 50కు, ఆటో ధరను రూ. 10 నుంచి రూ. 25 కు పెంచుతూ ధర్మకర్తల మండలి సమావేశంలో 2021 ఆగస్టు 14న తీర్మానం చేశారు. ఇదిలా ఉంటే సదరు కాంట్రాక్టర్ 2021 అక్టోబర్ 15న టోల్ గేట్ నిర్వహణ బాధ్యతలను చేపట్టారు.
అయితే టెండర్ షరతుల్లోని ధరలను వసూలు చేయాల్సిన కాంట్రాక్టర్, ధర్మకర్తల మండలి సమావేశంలో చేసిన తీర్మానాన్ని అడ్డుపెట్టుకుని ఏడాది పాటు అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. కొందరు దేవస్థానం అధికారులు, సిబ్బంది సహకారంతోనే కాంట్రాక్టర్ ఇదంతా చేసినట్టు ప్రస్తుత ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు గుర్తించారు. దాంతో సదరు కాంట్రాక్టర్ కు నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా భక్తుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ. 27 లక్షలను తిరిగి దేవస్థానానికి చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు.
Read Also: Anesthetic Injection: ఖమ్మంని కమ్మేసిన మత్తు.. వెలుగులోకి మరో ‘సూది హత్య’