
తెలుగు రాష్ట్రాల్లో మరికాసేపట్లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతుండగా, తెలంగాణ రాష్ట్రంలో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజక వర్గానికి ఉపఎన్నిక జరగబోతున్నది. ఈ ఉప ఎన్నికల కోసం అన్ని పార్టీలు ప్రచారం నిర్వహించాయి. అన్ని పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తిరుపతి నియోజక వర్గంలో త్రిముఖ పోటీ నెలకొన్నది. అధికార వైసీపీ సిట్టింగ్ స్థానం కావడంతో గెలుపుపై ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నది. అదే విధంగా తప్పకుండా తామే గెలుస్తామని టీడీపీ చెప్తుండగా, తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే కేంద్ర మంత్రి పదవి లభిస్తుందని, తద్వారా కేంద్రం నుంచి అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయని బీజేపీ చెప్తున్నది. ఇక సాగర్ ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ తమదే విజయం అని చెప్తుండగా, కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అదే విధంగా బీజేపీ కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాబోతున్నది. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. మే 2 వ తేదీన ఫలితాలు వెలువడతాయి.