TTD: తిరుమల శ్రీవారి భక్తుల అలర్ట్.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. జులై నెలకు సంబంధించిన వివిధ దర్శన, సేవా టికెట్లను ఇవాళ్టి నుంచే ఆన్లైన్లో విడుదల చేయనుంది. శ్రీవారి దర్శనం కోసం ముందుగానే టికెట్లు బుక్ చేసుకునే భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. టీటీడీ తెలిపిన వివరాల ప్రకారం, ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు లక్కీడిప్ విధానంలో కేటాయించే దర్శన టికెట్ల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అనంతరం ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్ ద్వారా ఆర్జిత సేవా టికెట్ల కేటాయింపు జరగనుంది. అదేవిధంగా, ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను టీటీడీ ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురానుంది.
Read Also: Amit Shah: రాహుల్, ప్రియాంకా గాంధీని చూసైనా కాస్త నేర్చుకో..
ఇక, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే శ్రీవారిని 69,049 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 23,842 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.57 కోట్లుగా నమోదైంది. శ్రీవారి దర్శనం కోసం జూలై నెల టికెట్లు విడుదలవుతున్న నేపథ్యంలో భక్తులు అధికారిక టీటీడీ వెబ్సైట్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
