ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో 1.7 కేజీల బంగారం.. 8.6 కేజీల వెండి లభ్యం..?

Tirumala Deputy Eo Lokanath

Tirumala Deputy Eo Lokanath

ACB Raids: తిరుమల డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో భారీగా బంగారం, వెండి గుర్తించినట్లు సమాచారం. ఇప్పటివరకు నిర్వహించిన పరిశీలనలో 1.7 కేజీలకు పైగా బంగారం, 8.6 కేజీలకు పైగా వెండి ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎస్టీవీ నగర్‌లోని ఎస్‌బీఐ బ్యాంకులో ఉన్న లాకర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. లాకర్‌ను తెరిచి పరిశీలించేందుకు బ్యాంకు అధికారులకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. లాకర్‌లోని వస్తువుల వివరాలను కూడా అధికారులు పరిశీలించనున్నారు.

అదేవిధంగా లోకనాథానికి సంబంధించిన స్థిరాస్తుల పత్రాలు, బంగారు, వెండి ఆభరణాలకు సంబంధించిన రశీదులను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆస్తులు, ఆభరణాలకు సంబంధించిన వివరాలను సేకరించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో లోకనాథం నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే ఏడు బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి.. తిరుపతిలోని లోకనాథం నివాసంతో పాటు తిరుమలలోని వసతిగృహం, ఆయన బంధువుల ఇళ్లలో ఒకేసారి ఏసీబీ సోదాలు జరిగాయి..