Site icon NTV Telugu

Tirupati: విష్ణు నివాసం దగ్గర తీవ్ర తొక్కిసలాట.. నలుగురు భక్తులు దుర్మరణం

Ttd

Ttd

తిరుపతి విష్ణు నివాసం దగ్గర తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల కోసం భారీగా భక్తులు పోటెత్తారు. దీంతో తీవ్ర తొక్కిసలాట జరగడంతో నలుగురు భక్తులు  ప్రాణాలు కోల్పోయారు.  పలువురు భక్తులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జనవరి 10, 11,12 తేదీల్లో వైకుంఠ దర్శనాలకు సంబంధించి మొదటి మూడు రోజులకు 1.20 లక్షల టోకెన్లను గురువారం ఉదయం నుంచి టీటీడీ జారీ చేస్తోంది. ఇందుకోసం బుధవారమే అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఒకేసారి భక్తులను వదలడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది.

గురువారం ఉదయం 5 గంటల నుంచి తిరుపతిలోని తొమ్మిది కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 94 కౌంటర్ల ద్వారా వైకుంఠ  దర్శనం టోకెన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. అయితే టోకెన్ల కోసం బుధవారం సాయంత్రమే భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూలైన్లలోకి భక్తులను ఒక్కసారిగా వదలడంతో తోపులాట జరిగింది. తొక్కిసలాటలో గాయపడిన భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. తోపులాట జరిగిన ప్రాంతాలకు విజిలెన్స్‌, పోలీసు బలగాలు భారీగా చేరుకున్నారు.

సమాచారం అందుకున్న టీడీడీ ఈవో శ్యామల రావు సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. పోలీసులతో కలిసి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలిస్తున్నారు.

Exit mobile version