ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు లేఖ రాసారు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. ఈ నెల 19వ తేదీన జరిగిన సభలో జరిగిన ప్రొసీడింగ్సును ఎలాంటి ఎడిటింగ్ లేకుండా ఇవ్వాలని లేఖలో కోరారు అనగాని. ఈనెల 19వ తేదీన శాసనసభలో జరిగిన చర్చను ఎటువంటి ఎడిటింగ్ లేకుండా ఆడియో, వీడియోలను ప్రజల ముందు పెట్టాలి. గత రెండున్నరేళ్లుగా వ్యక్తిగత దూషణలు, విమర్శలు చోటు చేసుకోవడం అత్యంత బాధాకరం. స్త్రీ, పురుషులనే బేధం లేకుండా సభకు పరిచయం లేని వ్యక్తులను కూడా దూషణల్లోకి లాగుతున్నారు. నిండు శాసన సభలో ఒక స్త్రీ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యాఖ్యలు చేశారు.
సభలో లేని, సభకు సంబంధం లేని చంద్రబాబు అర్ధాంగి, నారా భువనేశ్వరిపై పాలకపక్ష సభ్యులు చేసిన నిందారోపణలు మహిళల మనోభావాలను తీవ్రంగా కించపరిచినట్లు అయింది. ప్రభుత్వం మాత్రం భువనేశ్వరి గారి పట్ల ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని బుకాయిస్తోంది.19వ తేదీన శాసన సభలో జరిగిన చర్చలు అన్నీ సభాసాంప్రదాయం ప్రకారం రికార్డు చేయబడతాయి. ఆ రికార్డులన్నింటినీ ఎటువంటి వీడియో, ఆడియో ఎడిటింగ్ లేకుండా ప్రజల ముందు ఉంచాలని కోరుతున్నాం. భాపతిగా, ఎలాంటి పక్షపాతం లేకుండా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి. స్పీకరుకున్న విచక్షణాధికారాలను ఉపయోగించి ఆడియో, వీడియోలను ఎటువంటి తొలగింపుల్లేకుండా బయటపెట్టాలి అని పేర్కొన్నారు.
