ఇరాన్ యుద్ధం గల్ఫ్ దేశాల్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది. ప్రపంచ ఆర్ధిక వృద్ధికి చిరునామాగా గల్ఫ్ ముద్ర వేగంగా తొలగిపోతోంది. మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ దుబాయ్ ఇప్పుడు కళావిహీనమైంది. ఆతిథ్యం, రియల్ ఎస్టేట్, పర్యాటకం, విమానయాన రంగం.. ఇలా ఒకటేమిటి అన్ని రంగాలూ పూర్తిగా పడకేశాయి. మిలియనీర్లు వలసపోతున్నారు. పెట్టుబడులు తరలిపోతున్నాయి. ఏతావాతా యుద్ధంతో గల్ఫ్ ప్రాంతం పాతికేళ్లు వెనక్కిపోయింది. అమెరికా – ఇరాన్ మధ్య యుద్ధం గల్ఫ్ దేశాలను కోలుకోలేనంత దెబ్బతీసింది. ప్రధానంగా దుబాయ్ 25 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది. ఇన్వెస్ట్మెంట్స్,రియల్ ఎస్టేట్, టూరిజం, హోటల్ ఇండస్ట్రీ, ఎయిర్ లైన్స్ సర్వ నాశనం అయ్యాయి. గల్ఫ్ దేశాల్లో కొద్దో గొప్పో క్యాష్ రిచ్ కంట్రీ అయిన యూఏఈలోని అబుదాబీ మాత్రం కొంత నిలబడగలిగింది. కమర్షియల్ క్యాపిటల్ అయిన దుబాయ్ సర్వ నాశనమైంది.
అవకాశాల స్వర్గంగా అమెరికాకు పేరుంటే.. పెట్టుబడులకు స్వర్గధామంగా గల్ఫ్ పేరు తెచ్చుకుంది. ఏ రంగంలో అయినా సాఫీగా వ్యాపారం చేసే వీలు, ప్రపంచం నలువైపులకూ వాణిజ్య మార్గాలతో గల్ఫ్ పెట్టుబడిదారుల్ని సూదంటురాయిలా ఆకర్షించింది. ఆ తర్వాత లైఫ్స్టైల్ పరంగానూ మిలియనీర్లను ఆకట్టుకున్న గల్ఫ్.. ఇంతకుమించిన సౌకర్యాలు మరెక్కడా లేవనే రీతిలో భూలోక స్వర్గాన్ని సృష్టించినంత పని చేసింది. ఇక నైట్ లైఫ్ అయితే అది వేరే లెవల్. ఇదే రకమైన నైట్ లైఫ్ ఇతర దేశాల్లో ఉన్న.. ఇక్కడి ఫీల్ మరెక్కడా రాదనేది మొన్నటిదాకా టూరిస్టులు చెప్పిన మాట. కానీ ఇదంతా గతకాలపు ఘనచరిత్రే. ఉరుము లేని పిడుగులా వచ్చిపడ్డ ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ కొంప ముంచింది. అప్పటిదాకా కళకళలాడిన గల్ఫ్ దేశాలకు.. యుద్ధం దెబ్బతో ఈగలు తోలుకునే దుస్థితి వచ్చింది. మొన్నటిదాకా గల్ఫ్కు విదేశీయులు క్యూ కట్టగా.. ఇప్పుడు గల్ఫ్ నగరాలు వేగంగా ఖాళీ అవుతున్నాయి. దీంతో వలసదారుల కార్యకలాపాల మీద అతిగా ఆధారపడ్డ గల్ఫ్ ఆర్థికవ్యవస్థ.. ఇప్పుడు పూర్తిగా కుప్పుకూలే పరిస్థితి వచ్చింది.
ఇక్కడ గల్ఫ్ దేశాలు ప్రత్యక్షంగా యుద్ధంలో దెబ్బతినడం ఒక వంతైతే.. పరోక్షంగా దుబాయ్ ఎకానమీ పూర్తిగా కుప్పకూలింది. యూఏఈ దెబ్బతింటే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా దెబ్బతగిలినట్టే. దుబాయ్కి రోజుకు 20వేల కోట్ల రూపాయల నష్టం వస్తోంది. అంటే నెలకు ఆరు లక్షల కోట్ల రూపాయలు. సంవత్సరానికి 72 లక్షల కోట్ల రూపాయలు కోల్పోతుంది. అమెరికా వార్ బేస్లకు ఆశ్రయం కల్పించి.. ఎంత దెబ్బ తిన్నామో గల్ఫ్ దేశాలకు ఇప్పుడు తెలుస్తోంది. రబ్బరు చెప్పులు, ఒంటె ప్రయాణాలను మళ్లీ మీకు గుర్తు చేస్తామంటూ.. IRGC ముందే వార్నింగ్ ఇచ్చింది. అంత కాకపోయినా దుబాయ్ సహా మిగిలిన గల్ఫ్ దేశాలను దారుణంగా దెబ్బతీసింది.
పర్యాటకం కుప్పకూలడం, రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా తగ్గిన అమ్మకాలు, విదేశీ పెట్టుబడుల తరలింపు వంటి పరిణామాలు దుబాయ్ భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితిని సృష్టించాయి. నిరంతర దాడుల భయంతో పర్యాటకులు, విదేశీయులు దుబాయ్కి రావడం తగ్గించారు. ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, మాల్స్ నిర్మానుష్యంగా మారడంతో హోటళ్లు, విమానయాన సంస్థలు భారీగా నష్టపోతున్నాయి. గతంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందిన దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒక్కసారిగా కుదేలైంది. ఇళ్ల ధరలు భారీగా పడిపోవడంతో పాటు కొత్త అమ్మకాలు నిలిచిపోయాయి. దీంతో అనేక చిన్న బ్రోకరేజ్ సంస్థలు, నిర్మాణ కంపెనీలు మూతపడే పరిస్థితికి వచ్చాయి. మిడిల్ ఈస్ట్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచ బ్యాంక్ ఈ ప్రాంత వృద్ధి అంచనాలను గణనీయంగా తగ్గించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్ధిక వ్యవస్థకు ఇది పెద్ద షాక్గా మారింది.
యుద్ధ భయం ఏ స్థాయికి చేరిందంటే, గల్ఫ్ నుంచి బయటపడటానికి సంపన్నులు తమ ఆస్తులను వెచ్చించేందుకు కూడా వెనకాడటం లేదు. కేవలం ఒక ప్రైవేట్ జెట్ సీటు కోసం లేదా ప్రత్యేక విమానం కోసం సుమారు 3.2 కోట్ల రూపాయల వరకు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రైవేట్ భద్రతా సంస్థల సాయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా విలాసాల కోసం ఖర్చు చేసే ధనవంతులు, ఇప్పుడు కేవలం ప్రాణ రక్షణ కోసం తమ జీవితకాల సంపాదనను ధారపోస్తున్నారు. యుద్ధం అనేది పేద, ధనిక అనే తేడా లేకుండా అందరినీ సమానంగా భయపెడుతుందని ఈ పరిస్థితులు నిరూపిస్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో గల్ఫ్ నుంచి బయటపడటానికి సౌదీ అరేబియా మాత్రమే ఏకైక మార్గంగా కనిపిస్తోంది. దుబాయ్, అబుదాబి, ఖతార్లలో విమానాశ్రయాలు దెబ్బతినడంతో, సంపన్నులంతా సుమారు 10 గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణించి సౌదీ రాజధాని రియాద్కు చేరుకుంటున్నారు. రియాద్లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇంకా విమాన సర్వీసులు కొనసాగుతుండటమే దీనికి కారణం. 35 కిలోమీటర్ల మేర లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ, వేలాది డాలర్లు ఖర్చు చేస్తూ ఎలాగైనా రియాద్ చేరుకుని, అక్కడి నుంచి తమ స్వదేశాలకు వెళ్లాలని వారు ఆరాటపడుతున్నారు. గల్ఫ్ దేశాల చరిత్రలో ఇదొక అతిపెద్ద ధనికుల వలసగా మిగిలిపోయేలా ఉంది.
మొన్నటివరకు గల్ఫ్ అంటే ఉన్న ఇమేజ్ వేరు.. ఇప్పుడు ఇరాన్ యుద్ధం తర్వాత సీన్ వేరు. ప్రపంచంలోనే అత్యంత భద్రమైన ప్రదేశంగా.. పెట్టుబడులకు సురక్షిత స్థావరంగా డప్పు కొట్టుకున్న గల్ఫ్ సామర్థ్యం ఏ పాటిదో ఒక్క యుద్ధంతో తేలిపోయింది. కళ్లు చెదిరే భవంతులు, ఇరవై నాలుగ్గంటలు తళుకుబెళుకులున్నా.. అవసరమైన భద్రత మాత్రం కనీసస్థాయిలో కూడా లేదని నిరూపితమైంది. గల్ఫ్ దేశాలు అన్నింటికీ అమెరికాపై ఏ స్థాయిలో ఆధారపడుతున్నాయో చూసి.. ప్రపంచం తెల్లబోతోంది. మొన్నటిదాకా అమెరికా అవకాశాల స్వర్గమైతే.. మా దేశాలు పెట్టుబడులకు స్వర్గధామాలని గల్ఫ్ సగర్వంగా చెప్పుకుంది. అందుకు తగ్గట్టుగానే దుబాయ్ లాంటి నగరాల్లో ఏడాది పొడవునా అంతర్జాతీయ బిజినెస్ కు సంబంధించిన ఏదో కార్యక్రమం జరుగుతూ చాలా సందడిగా ఉండేది. ప్రపంచంలో కొత్త మోడల్ కార్లు కూడా పనిగట్టుకుని దుబాయ్లోనే లాంచ్ అవుతుండేవి. ఇక విమానయాన రంగంలోనూ కొత్త సాంకేతికలు, సదుపాయాలు అన్నీ దుబాయ్ కేంద్రంగానే ప్రపంచ దేశాలు తెలుసుకునేవి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రపంచంలో ఎక్కడ ఏ కొత్త విషయం ఎవరికి తెలియాలన్నా.. ఏ కొత్త ఆవిష్కరణ జరగాలన్నా.. దానికి దుబాయ్ కేంద్రంగా ఉంటేనే బాగుంటుందనే నమ్మకం ప్రపంచ పెట్టుబడిదారుల్లో బలపడిపోయింది. దీనికి తోడు గల్ఫ్ దేశాలకు ప్రత్యేకంగా ఎవరితోనూ శత్రుత్వం లేకపోవడం.. గత మూడు దశాబ్దాల్లో ఆ ప్రాంతంలో ఎలాంటి యుద్ధం జరగపకపోవడం.. పెట్టుబడిదారులకు మరింత నమ్మకాన్నిచ్చాయి. ఆపైన అమెరికా స్థావరాలు ఉండనే ఉన్నాయి. దీంతో ఇక గల్ఫ్ శత్రుదుర్భేద్యం అనే ఊహల్లో ప్రపంచ పెట్టుడిదారులంతా ఊరేగారు. కానీ ఒక్క యుద్ధం వారి ధీమాను పటాపంచలు చేసింది. కేవలం మూడు వారాల్లోనే ఆకాశహర్మ్యాలు, తమకే సాధ్యమైన అభివృద్ధితో ఆకాశంలో విహరించిన గల్ఫ్ నగరాలు.. కళ్ల ముందే కుప్పకూలాయి. చివరకు ఎన్ని ఉన్నా.. భద్రత విషయంలో గల్ఫ్ ఎంత అతి సున్నితంగా ఉందో చూసి.. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది.
ఇన్నాళ్లూ అమెరికాని నమ్ముకుని కళ్లు మూసుకున్న గల్ఫ్ దేశాలు కూడా.. భారీ నష్టం జరగడంతో.. ఇప్పుడిప్పుడే అతి కష్టం మీద కళ్లు తెరిచే ప్రయత్నం చేస్తున్నాయి. అమెరికాకు తమ భూభాగంలో సైనిక స్థావరాలు ఏర్పాటుచేసుకునే అవకాశం ఇచ్చి.. తమ భద్రత చూస్తున్నందుకు కొంత డబ్బు చెల్లిస్తూ.. ఇప్పటిదాకా బతికేసిన గల్ఫ్ దేశాలకు.. ఇరాన్ ఇచ్చిన వరుస షాకులతో కళ్లు బైర్లుకమ్మాయి. పైగా తాము బాగా నమ్మిన అమెరికా సామర్థ్యం ఎందుకూ కొరగాదని తేలిపోవడంతో.. అవాక్కవటం వాటి వంతైంది. ఇన్నాళ్లూ మనకేంటి..? మన దగ్గర కావాల్సినంత డబ్బుంది. కాస్త డబ్బు పారేస్తే.. మన రక్షణ చూడటానికి అమెరికా ఉంది. అమెరికాను ఓడించే దేశం ఎక్కడుంది..? ఈ మాత్రం దానికి అనవసరంగా రక్షణ పేరుతో డబ్బు తగలేయటం ఎందుకు దండగ. ఆ డబ్బును కూడా అభివృద్ధికే ఖర్చు పెడితే.. మరిన్ని పెట్టుబడులు వచ్చి ఆదాయం పెరుగుతుంది కదా. ఇదీ గల్ఫ్ దేశాలు వేసిన గుడ్డి లెక్క. కానీ ఈ లెక్క కరెక్ట్ కాదనే సంగతి చూచాయగా కాదు ఆధారాలతో సహా తెలిసినా.. గల్ఫ్ మాత్రం భద్రతను ఎప్పుడూ సీరియస్గా తీసుకోలేదు. అలాగే గల్ఫ్లో అసలు యుద్ధం రాదనే ధీమా కూడా పూర్తిగా లేదు. ఎందుకంటే మూడు దశాబ్దాల క్రితం ఇదే ప్రాంతంలో వచ్చిన యుద్ధం.. మొత్తం ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసి.. ఇంధన సంక్షోభం తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం వచ్చినప్పుడూ అదే జరిగింది. అంటే ఇక్కడ ఎప్పుడు యుద్ధం వచ్చినా.. నష్టం ఊహించని విధంగానే ఉంటుందనేది తెలిసిన విషయమే. కానీ కేవలం చమురు ఎగుమతుల మీదే ఆధారపడ్డ గల్ఫ్ మాత్రం ప్లాన్ బీ సంగతి కనీసం ఆలోచించకపోవడం.. తెలిసి చేసిన తప్పిదమే అనడంలో సందేహం లేదు. ఈ స్వయంకృతం కారణంగానే ఇప్పుడు అన్ని రంగాలూ కుప్పకూలుతుంటే.. కళ్లప్పగించి చూడటం మినహా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది గల్ఫ్.

