విద్యుత్ మీటర్ల గుర్చి ప్రతిపక్షాలు మాటాడుతున్నాయని.. అసలు మీటర్ సిస్టమ్ పెట్టిందే చంద్రబాబు అని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. విద్యుత్ మీటర్ సిస్టమ్ ప్రవేశపెట్టలేదని చంద్రబాబును చెప్పమనండంటూ సీతారాం ప్రశ్నించారు. రైతుకు కావలసిన విద్యుత్ డైవర్షన్స్ను అరికట్టేందుకే ఈ మీటర్ల ప్రక్రియ అని ఆయన వెల్లడించారు. మీటర్లు పెట్టకపోతే విద్యుత్ మిగుల్చుకోలేమన్న ఆయన.. సిస్టమ్ కరెక్ట్ చేసి రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తే తప్పా అంటూ ప్రశ్నించారు.
నాడు పెద్దలు నచ్చిన కంపెనీల వద్ద మాట్లాడుకుని అక్కడికి వెళ్లాలని రైతులకు చెప్పేవారని.. కానీ ప్రస్తుతం రైతులు వారికి నచ్చిన దగ్గర ట్రాక్టర్లు, యంత్రాలు కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో లంచం లేకుంటే వాహనాలు వచ్చేవి కావని సీతారాం విమర్శలు గుప్పించారు. నేడు రాజకీయ దళారీలు లేరని, జన్మభూమి కమిటీలు లేవని.. నేరుగా ప్రజలకు లబ్ధి చేకూరుతోందన్నారు. గడప గడపకూ ప్రభుత్వ ఫలాలు అందుతుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. రైతు భరోసా కేంద్రాలను సందర్శించేందుకు వివిధ రాష్ర్టాల నుంచి ఎమ్మెల్యేలు వస్తున్నారని తమ్మినేని స్పష్టం చేశారు.