Sajjala: ప్లాన్ చేసింది.. అమలు చేసింది ఆ రెండు పార్టీలే..!!

Sajjala Rama Krishna Reddy

Sajjala Rama Krishna Reddy

అమలాపురంలో అల్లర్లు జరిగిన విధానంపై పలు పార్టీల స్పందన చూస్తుంటే వాళ్లే కథంతా నడిపించారని అనుమానం కలుగుతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అమలాపురంలో దాడులకు కారణం వైసీపీ అని టీడీపీ, జనసేన పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయని.. ఆ పార్టీలవి దుర్మార్గపు రాజకీయాలని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మంత్రి, తమ ఎమ్మెల్యే ఇళ్లపై తామే దాడులు చేయించుకుంటామా అని సజ్జల ప్రశ్నించారు. ఈ దాడులు కుట్రపూరితంగా పథకం ప్రకారమే జరిగాయని సజ్జల స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అభ్యంతరం దేని మీదో స్పష్టం చేయాలని.. వాళ్లు దాడిని ఖండిస్తున్నారా లేదా కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని ఖండిస్తున్నారో చెప్పాలని సజ్జల డిమాండ్ చేశారు. ఇంత నీచమైన పనికి పాల్పడతారని పోలీసులు ముందే ఎలా ఊహిస్తారని ఆయన ప్రశ్నించారు.