NTV Telugu Site icon

ఆర్మీ ఆస్పత్రి కమాండర్‌కు రఘురామకృష్ణరాజు లేఖ

Raghu Rama

వైసీపీ రెబ‌ల్ నేత‌, ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి కమాండర్‌కు లేఖ రాశారు… పెయిన్‌ కిల్లర్స్‌, యాంటీ బయాటిక్స్‌ వాడుతున్నా.. అయినా, నా కాలి నొప్పి ఇంకా తగ్గలేద‌న్న ఆయ‌న‌.. బీపీలో కూడా హెచ్చుత‌గ్గుద‌ల కనిపిస్తోంద‌ని.. నోరు కూడా తరచుగా పొడారిపోతోంద‌ని లేఖ‌లో పేర్కొన్నారు.. రెండు, మూడు రోజులు ఆస్పత్రిలోనే.. డాక్టర్ల పర్యవేక్షణలో త‌న‌కు చికిత్స అందించాల‌ని కోరిన ఎంపీ… అయినా మీరు డిశ్చార్జ్‌ చేయాలనుకుంటే.. డిశ్చార్జ్‌ సమ్మరీలో నా ఆరోగ్య పరిస్థితిని స్పష్టంగా తెలియ‌జేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.. ఇక‌, సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఏపీకి చెందిన కొందరు పోలీసులు.. ఆస్పత్రి దగ్గర ఉన్నట్లు తెలుస్తోంద‌ని త‌న లేఖ‌లో పేర్కొన్నారు ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు.

మ‌రోవైపు.. గుంటూరు అర్బన్‌ ఎస్పీకి కోర్టు ధిక్కార నోటీసులు పంపారు ఎంపీ రఘురామకృష్ణరాజు న్యాయవాది దుర్గాప్రసాద్‌… రఘురామ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన వెంటనే తీసుకురావాలని.. ఎస్కార్ట్‌ను ఆదేశించినట్లు సమాచారం అందింద‌ని.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రఘురామ బెయిల్‌పై విడుదలైనట్లే అన్నారు.. విడుదలైన 10 రోజులకు బాండ్లను కోర్టుకు సమర్పించాలని.. సుప్రీంకోర్టు ఆదేశించింద‌ని గుర్తు చేస్తున్నారు దుర్గాప్రసాద్‌.. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రఘురామను తీసుకురావాలని.. ఎస్కార్ట్‌ను పంపడం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లే న‌న్న ఆయ‌న‌.. అందుకే నోటీసులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.. హైదరాబాద్‌ నుంచి గుంటూరు అర్బన్‌ ఎస్పీకి నోటీసులు పంపారు ర‌ఘురామ న్యాయ‌వాది దుర్గాప్రసాద్.