PV Sindhu : మ్యాజిక్ డ్రెయిన్స్‌తో పల్లెల్లో సరికొత్త విప్లవం

  • మ్యాజిక్ డ్రెయిన్స్ తో పల్లెల్లో పారిశుధ్య విప్లవం తెచ్చారు
  • గ్రామాల్లో మురుగునీటి సమస్యకు ఇది చక్కటి పరిష్కార మార్గం
  • సిమెంటు డ్రెయిన్లతో పోలిస్తే 80 శాతం నిర్మాణ వ్యయం ఆదా
  • ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు
Pv Sindh

Pv Sindh

PV Sindhu : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన ‘మ్యాజిక్ డ్రెయిన్స్’ పథకంపై ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ మెడలిస్ట్ పి.వి. సింధు ప్రశంసల జల్లు కురిపించారు. పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన గ్రామీణాంధ్రప్రదేశ్ లక్ష్య సాధన కోసం పవన్ కళ్యాణ్ విప్లవాత్మక ఆలోచనలను అమలు చేస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న ఈ మ్యాజిక్ డ్రెయిన్స్ పల్లెల్లో మురుగు సమస్య నివారణలో ఒక ‘గేమ్ ఛేంజర్’ లాంటిదని ఆమె కొనియాడారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ 20 నెలల పాలన గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ విడుదల చేసిన వీడియో సందేశంలో, మ్యాజిక్ డ్రెయిన్స్ వంటి సరికొత్త విధానాలు అమలు చేయడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.

పాలనా వ్యవహారాలు కొత్తే అయినా పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమాలతో ప్రజా సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్నారని సింధు పేర్కొన్నారు. మన దేశంలో మెజారిటీ ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని, అయితే గ్రామాల్లో పారిశుధ్యం అనేది ఎప్పుడూ ఒక పెద్ద సవాలుగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. సరైన మురుగు నీటి పారుదల వ్యవస్థ లేక ప్రజలు అపరిశుభ్ర వాతావరణంలో జీవనం సాగించాల్సి వస్తోందని, ఈ సమస్యకు మ్యాజిక్ డ్రెయిన్స్ రూపంలో అద్భుత పరిష్కార మార్గాన్ని కనుగొన్నారని ఆమె తెలిపారు. ఈ విధానంలో ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి వెళ్తుందని, మూడంచెల ఫిల్టర్ బెడ్ల ద్వారా నీరు శుద్ధి చేయబడి భూగర్భ జలంగా మారుతుందని ఆమె వివరించారు. దీనివల్ల మురుగు నీరు నిల్వ ఉండటం, దుర్వాసన రావడం వంటి సమస్యలు పటాపంచలవుతాయని ఆమె కొనియాడారు.

సాధారణ సిమెంట్ డ్రెయిన్ల నిర్మాణంతో పోలిస్తే మ్యాజిక్ డ్రెయిన్ల వల్ల సుమారు 80 శాతం నిర్మాణ వ్యయం ఆదా అవుతుందని పి.వి. సింధు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంతోపాటు పారిశుధ్యాన్ని పెంపొందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని, ప్రజలు ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించే వెసులుబాటు కల్పిస్తాయని ఆమె వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ భవిష్యత్తులోనూ ఇలాంటి ముందు చూపుతో కూడిన వినూత్న కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహకారంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో , పవన్ కళ్యాణ్ దార్శనికత్వంలో గ్రామీణాంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఆమె తన సందేశాన్ని ముగించారు.