Kambham Road Accident: ప్రకాశం జిల్లా కంభంలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. పెళ్లి ముహూర్తానికి కొద్ది సేపటి ముందే పెళ్లి బృందంపైకి అదుపుతప్పిన లారీ దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అమరావతి–అనంతపురం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజార్కు చెందిన పెళ్లి బృందం కంభంలో జరగనున్న వివాహానికి హాజరైంది. ఉదయం 9:30 గంటలకు వివాహం జరగాల్సి ఉండగా, అంతకుముందు స్థానిక వినాయకుడి ఆలయం వద్ద పెళ్లికూతురితో కొబ్బరికాయ కొట్టించే కార్యక్రమం నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు నిలబడి ఉన్నారు. అదే సమయంలో వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి నేరుగా వారిపైకి దూసుకెళ్లింది.
పెళ్లి బృందాన్ని ఢీకొట్టిన అనంతరం లారీ మరో మూడు ద్విచక్ర వాహనాలు, రెండు బడ్డీ బంకులను కూడా ఢీకొట్టడంతో అక్కడ తీవ్ర భయాందోళన నెలకొంది. ప్రమాదంలో ఆవుల అలకనంద (19), ఆవుల అంకాలు (20), ఆవుల నగేష్ (17), ఏడాదిన్నర చిన్నారి ఆవుల నాగేశ్వరి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో పెళ్లికూతురు ఆవుల వీరక్క తీవ్రంగా గాయపడగా, మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం తీవ్రంగా గాయపడిన నలుగురిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతి చెందిన వారిలో పెళ్లికూతురి ఇద్దరు సొంత అన్నలు, వదిన, మేనకోడలు ఉండటం కుటుంబ సభ్యులను విషాదంలో ముంచెత్తింది. పెళ్లి వేడుక జరగాల్సిన ఇంట్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకోవడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ప్రమాదానికి లారీ మితిమీరిన వేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన కంభం పోలీసులు ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

