Polavaram: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ప్రతి కుటుంబానికి న్యాయం చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో.. పోలవరం నిర్వాసితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రూ.307 కోట్ల పరిహారంతో పాటు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
నాలుగు విడతల్లో రూ.2250 కోట్ల పంపిణీ!
ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. పోలవరం కోసం సర్వస్వాన్ని కోల్పోయిన నిర్వాసితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘త్యాగమూర్తులు’ గా అభివర్ణిస్తున్నారని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు నాలుగు విడతలుగా మొత్తం రూ.2,250 కోట్లు పంపిణీ చేశామన్నారు. నిర్వాసితులు ఇళ్ళు నిర్మించుకోవడానికి ఇచ్చే సహాయాన్ని రూ.3.5 లక్షలకు, ఇంటి స్థలం కోసం ఇచ్చే మొత్తాన్ని రూ.2 లక్షలకు పెంచి ఇస్తున్నామన్నారు. నిర్వాసితుల కాలనీల నిర్మాణంతో పాటు, అక్కడ రోడ్లు, తాగునీరు వంటి అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేలా కూటమి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పని చేస్తోందని చెప్పారు.
నాటి వైసీపీ ప్రభుత్వం నిధులు దారిమళ్లించింది
గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి రామానాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. “నాడు జగన్ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన రియంబర్స్మెంట్ నిధులను పూర్తిగా దారిమళ్లించి, నిర్వాసితులను గోదావరిలో ముంచేసింది. కానీ నాడు, నేడు ఎల్లప్పుడూ చంద్రబాబే నిర్వాసితులకు అండగా నిలబడి న్యాయం చేస్తున్నారు. నిర్వాసితులను గుర్తించి, వారిని గౌరవించింది కేవలం కూటమి ప్రభుత్వమే” అని మంత్రి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో విధ్వంసానికి గురైన పోలవరం ప్రాజెక్టును మళ్లీ ట్రాక్లోకి తెచ్చామని మంత్రి ప్రకటించారు. జగన్ హయాంలో దెబ్బతిన్న చోట సరికొత్తగా డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. ఈరోజుకు పోలవరం ప్రాజెక్టు పనులు 86 శాతం పూర్తయ్యాయన్నారు. 2027 లో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి.. తొలిదశ ఆర్అండ్ఆర్ (R&R – పునరావాసం) ప్రక్రియను కూడా వంద శాతం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం సైతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని రకాలుగా నిధులు ఇస్తూ అండగా నిలుస్తోందని చెప్పారు. 2027 పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును సంపూర్ణంగా పూర్తి చేసి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అర్హులైన నిర్వాసితులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిహారం అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వారికి తోడుగా నిలబడాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ముఖ్యంగా అమాయక నిర్వాసితులను దళారులు మోసం చేయకుండా చూసేందుకు, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు.
