ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తర్వాత.. పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళనకు దిగుతున్నారు.. ప్రజా సంఘాలు వీరికి మద్దతుగా నిలుస్తుండగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా.. నిరుద్యోగుల ఆందోళనకు అండగా ఉంటామని ప్రకటించారు.. పవన్ను కలిసిన నిరుద్యోగ యువత వారి ఆవేదనకు ఆయనకు తెలియజేశారు.. దీంతో, ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతోంది జనసేన పార్టీ.. రేపు ఏపీలోని అన్ని ఎంప్లాయిమెంట్ ఆఫీసుల్లో వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనసైనికులకు పిలుపునిస్త ఓ వీడియో విడుదల చేశారు పవన్ కల్యాణ్.
జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ సమస్యలపై ఈ విడియోలో స్పందించిన జనసేనాని.. రాజకీయ నిరుద్యోగుల కోసం లేని పదవులు సృష్టించారు.. కానీ, ఆ చొరవ, ఆసక్తి నిరుద్యోగులపై లేదని మండిపడ్డారు.. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగుల బాధ కలచివేస్తోందన్న ఆయన.. 151 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 30 లక్షల మంది సపోర్టు కారణం అన్నారు.. 2.50 లక్షల ఉద్యోగాలు ఇస్తామని 10 వేల ఉద్యోగాలతో.. జాబ్ క్యాలెండర్లో పెట్టారని.. ఇది నిరుద్యోగులను నయవంచన చేయటమేనని మండిపడ్డారు.. ఇక, పోలీసు శాఖలో వేల పోస్టులు ఉంటే జాబ్ క్యాలెండర్లో వందల పోస్టులే పెట్టారని ఆవేదన వ్యక్తం చేసిన పవన్.. డీఎస్సీ ఊసే లేదన్నారు.. నిరుద్యోగులకు జనసేన అండగా ఉంటుంది, రేపు అన్ని జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇస్తామని.. జనసైనికులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
