తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న నియోజకవర్గం అది. ఆ పార్టీకి చెందిన హేమా హేమీల్లాంటి నేతలు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన సెగ్మెంట్. కానీ… ఇప్పుడు మా గోడు వినే నాధుడెవరంటూ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు తమ్ముళ్లు. కష్ట సుఖాలు చెప్పుకోవడానికైనా ఒకర్ని ఇవ్వమని మొరపెట్టుకుంటున్నారు? అధికారంలో ఉండి కూడా అంతటి దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏదా నియోజకవర్గం? ఏంటా పసుపు వేదన? శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపికి గట్టి పట్టుంది. మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి ఇక్కడి నుంచి ఆ పార్టీ తరపున 5 సార్లు ఎన్నికయ్యారు. మాజీ మంత్రి కళా వెంకట్రావ్ కూడా 2014లో ఈ నియెజకవర్గం ఎమ్మెల్యేగానే ప్రాతినిధ్యం వహించారు. అదంతా ఒక ఎత్తయితే… ఇక్కడి రాజకీయం ఎప్పుడూ రంజుగానే ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో ఇదో పొలిటికల్ హాట్ స్పాట్. అలాంటి చోట ప్రస్తుతం తెలుగుదేశం కార్యకర్తలు తీవ్ర నిర్వేదంలో ఉన్నారట. ఎలా బతికిన చోట ఎలా మారిపోయామంటూ వాళ్ళలో వాళ్లు మాట్లాడుకుంటున్నట్టు చెబుతున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జ్ కరవయ్యాడా? పట్టున్న చోట పార్టీకి ఆ స్థాయి నాయకుడు దొరకడం లేదా? ఇన్ఛార్జ్ నియామకంలో అధిష్టానం ఎందుకు తాత్సారం చేస్తోందంటూ… లోకల్ లీడర్స్, కేడర్ తెగ చర్చించుకుంటున్నారు. మరోవైపు కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడి త్యాగాలు చేసిన వారిని పట్టించుకునేవాళ్ళు లేకుండా పోయారన్న ఫ్రస్ట్రేషన్ సైతం పెరిగిపోతోంది. గత ఎన్నికల్లో ఈ సీటు బీజేపీ కోటాలోకి వెళ్ళింది. ఆ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నడికుదిటి ఈశ్వరరావు పోటీ చేసి గెలిచారు. దీంతో అటు ఎమ్మెల్యే దగ్గరికి రానివ్వక, ఇటు పార్టీ ఇన్ఛార్జ్ లేక మాకు దిక్కెవరంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట తమ్ముళ్శు.
అసలు మా గోడు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్ధంకావడం లేదన్నది వాళ్ళ బాధ. గతంలో ఇక్కడ మాజీ మంత్రి కళావెంకట్రావ్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు పోటాపోటీ రాజకీయం నడిపారు. కానీ… గత ఎన్నికల్లో కళా చీపురుపల్లి నుంచి పోటీ చేసి గెలిచాక ఆయన ఫోకస్ అటు షిఫ్ట్ అయింది. కలిశెట్టి కాస్త అందుబాటులో ఉంటాడని చెబుతున్నా…ఆయన ఎక్కువ సమయం ఢిల్లీకే పరిమితం అవుతున్నారు. దీంతో… అందరూ ఉన్నట్టు కనిపిస్తున్నా… అండగా నిలబడేవాళ్ళు లేకుండా పోయారంటూ గట్టిగా ఫీలవుతున్నారు ఇక్కడి టీడీపీ కార్యకర్తలు. ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు, జీ సిగడాం మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. మొత్తం నాలుగుకు నాలుగు మండలాల్లో టిడిపికి మంచి క్యాడర్ ఉంది.
2024 ఎన్నికల్లో ఈ సీటు కోసం కళావెంకట్రావు, కలిశెట్టి మధ్య తీవ్ర పోటీనే నడిచింది. ఆ పరిస్థితుల్లో…. కళాను చీపురుపల్లి పంపి, అప్పలనాయుుడుకు విజయనగరం ఎంపీ టిక్కెట్ ఇచ్చి… ఎవరికీ కాకుండా పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించింది టీడీపీ అధిష్టానం. ఆ పార్టీ అభ్యర్థి నడికుదిటి ఈశ్వరరావు మొదటిసారి బరిలో దిగినా…. లోకల్ తమ్ముళ్ళంతా కలిసి కష్టపడి గెలిపించారు. అప్పటి వరకు అంతా బాగానే ఉన్నా…. ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు తమను అస్సలు పట్టించుకోవడం లేదంటూ వాపోతున్నారు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు. పేరుకు బడా నేతలు ఉన్నా… నియోజకవర్గ ఇన్ఛార్జ్ని నియమించకపోవడం వెనుక మర్మం ఏంటో అర్ధం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు లేదా కళా వెంకట్రావు కొడుకు రాం మల్లిక్ నాయుడులో ఎవరో ఒకరికి పదవి ఇస్తే… మా గోడు వినిపించుకునే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు తెలుగుదేశం కార్యకర్తలు. స్థానిక సంస్దల ఎన్నికల లోపైనా ఎచ్చెర్లకు దిశానిర్దేశం చేయాలని, లేదంటే….మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నారు.

