Site icon NTV Telugu

‘ఆ హామీ ఏమైంది’ అంటూ సీఎం జగన్‌ను ప్రశ్నించిన లోకేష్

ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ మరోసారి లేఖ రాశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేప‌ల్లి రైల్వే స్థ‌లాలకు సంబంధించిన అంశంపై జగన్‌కు లోకేష్ లేఖ రాశారు. తాడేపల్లిలో రైల్వేస్థలాల్లో నివసిస్తున్న పేదవారికి గతంలో ప్ర‌భుత్వ పెద్ద‌లు ఇచ్చిన హామీ మేర‌కు… వేరేచోట ఇళ్లు క‌ట్టేవరకు రైల్వే అధికారులు ఇళ్లు కూల్చకుండా స‌మయం ఇచ్చేలా త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాలంటూ లేఖలో పేర్కొన్నారు.

Read Also: భారీగా పెరిగిన సెంట్రల్ విస్టా ఖర్చు.. డెడ్‌లైన్ పొడిగింపు

న‌ల‌భై ఏళ్లుగా ఇళ్లు క‌ట్టుకుని నివ‌సిస్తున్న అట్ట‌డుగువ‌ర్గాల‌కి చెందిన నిరుపేద‌ల‌ను ఒక్క‌రోజులో ఇళ్లు ఖాళీ చేయాల‌ని రైల్వే అధికారులు నోటీసులు జారీ చేయడం తగదన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరముందన్నారు. 2019 ఎన్నికల సందర్భంగా ఇప్పటి ఎమ్మెల్యే, పలువురు వైసీపీ నాయకులు ఈ రైల్వే స్థ‌లంలో ఉన్న పేద‌ల‌కు పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారని లేఖలో గుర్తుచేశారు. కూలి పనులకు వెళ్తే కానీ కూడు దొర‌క‌ని నిరుపేద‌లైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల‌కు చెందిన 650 కుటుంబాల స‌మ‌స్య‌ని వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. ప్ర‌భుత్వం తర‌ఫున వైసీపీ ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేర‌కు 650 మందికి వేరే చోట ఇళ్లు క‌ట్టి త‌ర‌లించేవ‌ర‌కూ ఇక్క‌డే నివాసం ఉండేలా రైల్వే అధికారుల‌ను ఒప్పించాల్సిన బాధ్య‌త ప్రభుత్వంపై ఉందని సీఎం జగన్‌కు రాసిన లేఖలో లోకేష్ పేర్కొన్నారు.

Exit mobile version