జగన్ గాల్లో నుంచి కిందకు దిగాలి: నారా లోకేష్

ఏపీలో వరద పరిస్థితులపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. రాయలసీమను వరదలు ముంచెత్తాయని… భారీ వర్షాలకు కడప జిల్లాలో 30 మంది గల్లంతయ్యారని, 12 మంది చనిపోయారని లోకేష్ తెలిపారు. వరదలతో ప్రజలు అల్లాడిపోతుంటే ఏం జ‌రిగిందో క‌నుక్కునే తీరిక లేని సీఎం జగన్‌ను ఏమనాలని లోకేష్ ప్రశ్నించారు. వరదలతో ప్రజలు కొట్టుకుపోతుంటే.. ఏరియల్ సర్వే పేరుతో సీఎం జగన్ గాల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్ గాల్లో నుంచి కిందకు దిగాలని హితవు పలికారు. జగన్ నేలపైకి వస్తేనే పేదప్రజల కష్టాలు కనిపిస్తాయన్నారు.

Read Also: త్వరలోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తా : చంద్రబాబు

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుని శాడిస్టిక్ ఆనందం పొందార‌ని మ‌నం చ‌రిత్ర పుస్త‌కాల‌లో చ‌దువుకున్నామ‌ని.. ఇప్పుడు నీరోకి మ‌రో రూపమైన జ‌గ‌న్‌రెడ్డిని ప్ర‌త్య‌క్షంగా చూస్తున్నామ‌ని లోకేష్ ఆరోపించారు. రాయ‌ల‌సీమ మొత్తం అకాల‌వ‌ర్షాల‌కు అల్ల‌క‌ల్లోల‌మైతే క‌నీసం అటువైపు క‌న్నెత్తి చూసే ఆలోచ‌న కూడా జ‌గ‌న్‌రెడ్డికి రాలేద‌ని లోకేష్ తప్పుబట్టారు. జగన్ సర్కారు వైఫల్యం వల్లే రాయలసీమలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం చోటుచేసుకున్నాయని లోకేష్ ఆరోపించారు.