ఏపీలో ప్రభుత్వాసుపత్రుల్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్. మొన్న విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో యువతిపై సామూహిక అత్యాచారం హేయమయినది అన్నారు. ఇవాళ మరో ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ప్రైవేట్ అంబులెన్స్ దందా కారణంగా అమానవీయ ఘటన జరిగిందని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?చేతగాని పాలకుడు జగన్ చెత్త పాలన కారణంగా అనారోగ్యంతో చనిపోయిన కొడుకు మృతదేహాన్ని తండ్రి 90 కి.మీ.బైక్ పై తీసుకెళ్లి అంత్యక్రియలు చెయ్యాల్సిన దుస్థితి. తిరుపతి రుయా ఆస్పత్రి నుండి బాలుడు జేసవా మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్స్ కావాలని వేడుకున్నా కనికరం చూపలేదు. ప్రైవేట్ అంబులెన్సుల ధరలు తట్టుకోలేక బైక్ పైనే రాజంపేట జిల్లాలోని చిట్వేలుకు 90 కి.మీ. మేర బాలుడి మృతదేహాన్ని తరలించారు ఆ తండ్రి.
గత తెలుగుదేశం ప్రభుత్వం పార్థివ దేహాన్ని ఉచితంగా తరలించే మహాప్రస్థానం రవాణా వాహనాలను ఏర్పాటు చేసింది. వైసీపీ ప్రభుత్వం మహాప్రస్థానం వాహనాలను నిర్వీర్యం చెయ్యడం కారణంగానే ప్రైవేట్ అంబులెన్స్ దందా పెరిగి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా సీఎం నిద్రలేచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు మెరుగుపర్చాలని లోకేష్ డిమాండ్ చేశారు.
Read Also: గుంటూరు టీడీపీలో గడబిడ..ప్రచార యావతో తమ్ముళ్ల కుమ్ములాట
