ఏపీ శాసనమండలి ఛైర్మన్ మోషేన్‌రాజు రాజకీయ ప్రస్థానం

ఏపీ శాసనమండలి నూతన ఛైర్మన్‌గా మోషేన్‌రాజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండలిలో ఛైర్ వద్దకు మోషేన్ రాజును జగన్ తీసుకువెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. మోషేన్‌రాజు నిబద్ధత గల రాజకీయ నాయకుడు అని సీఎం జగన్ అభినందించారు. అనంతరం మోషేన్‌రాజుకు మంత్రులు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు.

Read Also: కుటుంబ సభ్యులను కించపరచటం తగదు: పవన్‌ కళ్యాణ్‌

1965, ఏప్రిల్ 10న పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని గునుపూడిలో కొయ్యే సుందరరావు, మరియమ్మ దంపతులకు మోషేన్ రాజు జన్మించారు. డిగ్రీ అభ్యసించిన తర్వాత రాజకీయరంగప్రవేశం చేశారు. 1987 నుంచి వరుసగా నాలుగుసార్లు మున్సిపల్ కౌన్సిలర్‌గా, రెండుసార్లు ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. పీసీసీ ఎస్సీ, ఎస్టీ సెల్‌ ప్రత్యేక ఆహ్వానితుడిగా, కాంగ్రెస్‌ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శిగా, యూత్‌ కాంగ్రెస్‌ భీమవరం పట్టణ అధ్యక్షుడిగా వివిధ పదవులు నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఆ పదవికి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీకి మోషేన్‌ రాజు సేవలను గుర్తించిన సీఎం జగన్‌ గవర్నర్‌ కోటాలో ఆయనను ఎమ్మెల్సీ చేశారు.