ఏపీలో పీఆర్సీపై స్పష్టత నెలకొనడం లేదు. ఇటీవల సీఎం జగన్ ప్రకటించిన 11వ పీఆర్సీపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేసారు. మరోమారు సమ్మెకు పూనుకున్నారు. దీంతో ఏపీలో మరోసారి పీఆర్సీపై ఉత్కంఠ నెలకొంది. సీఎం ప్రకటించిన పీఆర్సీ ఉద్యోగులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు. అయితే దీనిపై స్పందించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పీఆర్సీకి అంగీకరించారాని అయన అన్నారు.
మళ్లీ ఇప్పుడు ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేయటం సరికాదని ఆయన హితవు పలికారు. వారికి ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వంతో మాట్లాడవచ్చని ఆయన స్పష్టం చేశారు. కోవిడ్ కేసులు పెరుగుతున్నా దాని తీవ్రత అంతలా లేదని, పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని ఆయన వెల్లడించారు. ఎక్కడైనా పిల్లలకు కోవిడ్ వస్తే ఆ పాఠశాల వరకూ మూసివేసి, శానిటైజ్ చేసిన తర్వాత మళ్లీ ప్రారంభిస్తామన్నారు. కొన్ని యూనివర్శిటీలు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాయని, కోర్టు కూడా పరీక్షలకు అనుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు.
