అన్నమయ్య జిల్లా రాయచోటిలోని సంబేపల్లి మండలంలో సర్వసభ్య సమావేశంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గైర్హజర్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్దికి నోచుకోని మండలం సంబేపల్లి అని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 90 శాతం అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తే సంబేపల్లి మండలం మాత్రం కరువు మండలంగా ప్రకటించలేదు అని ఆరోపించారు. మండల కేంద్రాలలో ఎటువంటి పని లేకున్నా.. సర్వసభ్య సమావేశాలలో అధికారులపై పెత్తనం చెలాయించిన ప్రజాప్రతినిధులు ఇప్పుడెక్కడున్నారు అంటూ ప్రశ్నించారు. అప్రజాస్వామ్య పద్దతిలో గెలిచిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ప్రభుద్దులకు సమావేశానికి రాకపోవడానికి సిగ్గుశరం ఉందా అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు.
Read Also: Mumbai Accident : ముంబైలో బీఎండబ్ల్యూ బీభత్సం.. బైక్ ను ఢీకొట్టడంతో మహిళ మృతి
ఇక, ఈ సమావేశం తెలుగుదేశం పార్టీ సొంత మీటింగ్ కాదు అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మండలం అభివృద్దికి కావాల్సిన వాటి గురించి చర్చ జరగడానికే ఈ సమావేశం.. అలాంటి సమావేశానికి సిగ్గు శరంలేకుండా రాలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికి మండల అభివృద్ది కోసం ప్రతి ప్రజా ప్రతినిధి కృషి చేయాలి అని పేర్కొన్నారు. అలా చేయని యెడల ప్రజల దగ్గర అవమానాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.. ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో ఉన్నప్పుడే కావాల్సిన అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది.. తెలుగుదేశం పార్టీని సంబేపల్లి మండల ప్రజలు ఎంతో ఆదరించారు.. ఈ ఐదేండ్లలో సంబేపల్లి మండలాన్ని అభివృద్ధి చేసి ఇక్కడి ప్రజల రుణాన్ని తీర్చుకుంటాను అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.