పోలవరం ప్రాజెక్టుపై మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అని.. పక్క రాష్ట్రాలను సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రపంచంలో ఏ ప్రాజెక్టు కట్టినా ఒకేసారి నీళ్లతో నింపరని.. దశలవారీగా ఆ పని పూర్తిచేస్తారన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మిస్తోందని… 41.15 మీటర్ల వరకు నీటిని నింపుతారని స్పష్టం చేశారు. అక్కడి వరకు ఉన్నవారికి ముందుగా పునరావాసం కల్పిస్తారని వివరించారు.
పోలవరం ప్రాజెక్టులో త్వరగా అయిపోయే పనులు చేసి మాజీ సీఎం చంద్రబాబు కమీషన్లు కొట్టేశారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు స్పిల్ వే కట్టకుండా కాపర్ డ్యాం కట్టి డబ్బులు కొట్టేశారన్నారు. అందుకే పోలవరాన్ని ఏటీఎంగా మార్చారని ప్రధాని మోదీ సైతం ఆరోపించినట్లు మంత్రి అంబటి రాంబాబు గుర్తుచేశారు. చంద్రబాబు నిర్వాకం వల్ల వరదలకు డయాఫ్రం వాల్ సైతం కొట్టుకుపోయిందని మండిపడ్డారు. ఇప్పుడు వీటిని మళ్ళీ కట్టాల్సి వచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితి ప్రపంచంలోనే తొలిటిసారిగా జరిగిందన్నారు. ఈ ఘనత చంద్రబాబుదే అని విమర్శలు చేశారు.
జగన్ సీఎం అయ్యాక చిత్తశుద్ధితో పోలవరం పనులు చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు వివరించారు. రూ.67 ఉన్న డీజిల్ ధరను కేంద్ర ప్రభుత్వం రూ.110కి పెంచిందని.. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సెస్ విధించక తప్పలేదన్నారు. ఏలూరు ప్రమాద ఘటనలో ప్రభుత్వం తీవ్రంగా స్పందించిందని.. బాధితులకు న్యాయం చేసేందుకు తగిన చర్యలు చేపట్టినట్లు మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.
