విజయనగరం వైసీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్పై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రశంసలు కురిపించారు. కరోనా సంక్షోభ సమయంలో వైసీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఎంతో విలువైన సేవలు అందించారని కొనియాడారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఓ అభినందన పత్రాన్ని పంపించారు. ఈ లేఖను ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మీడియాకు చూపించారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో బెల్లాన చంద్రశేఖర్ ప్రతిరోజు ఆసుపత్రులను సందర్శిస్తూ ప్రజల్లో ధైర్యం నింపారని ఆ లేఖలో స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. ఎంపీ నిధుల్లో రూ.30 లక్షలు ఖర్చు చేసి జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశారని, తద్వారా ఆక్సిజన్ కొరత తీరిందని ప్రశంసించారు. కాగా ఈ లేఖపై ఎంపీ బెల్లాన స్పందిస్తూ… తాను ఓ ఎంపీగా తన బాధ్యతలు నిర్వర్తించానని తెలిపారు. కరోనా వైరస్ ఉద్ధృతంగా వ్యాపిస్తున్న వేళ ప్రజలకు అండగా నిలవడం తన కర్తవ్యమని స్పష్టం చేశారు. నిత్యం ప్రజల మధ్య ఉండాలన్న సీఎం జగన్ ఆదేశాలను పాటించానని వివరించారు. తన సేవలను అభినందిస్తూ స్పీకర్ ఓం బిర్లా లేఖ పంపడం సంతోషదాయకమన్నారు.
