YS Jagan Kurnool Tour: కర్నూలులో నేడు జగన్ పర్యటన.. పోలీసుల అనుమతి.. షరతులు ఇవే..!

Ys Jagan

Ys Jagan

YS Jagan Kurnool Tour: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖత్‌లో జగన్ పరామర్శించనున్నారు. విరూపాక్షితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి భరోసా ఇవ్వనున్నారు. కర్నూలు పర్యటన కోసం వైఎస్‌ జగన్ ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 9.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో బయలుదేరి సుమారు 11 గంటలకు కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో పూడిచర్ల, నన్నూరు, టోల్‌గేట్, హ్యాంగ్‌ఔట్, కృష్ణానగర్ ఐటీసీ, చెన్నమ్మ సర్కిల్, బళ్లారి చౌరస్తా మీదుగా పంచలింగాలలోని జిల్లా జైలుకు చేరుకోనున్నారు.

మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3 గంటల మధ్య విరూపాక్షిని ములాఖత్‌లో కలిసేందుకు జగన్‌కు అనుమతి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ములాఖత్ అనంతరం విరూపాక్షి అరెస్ట్‌తో పాటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశాలపై జగన్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ పర్యటన నేపథ్యంలో జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు కర్నూలుకు తరలివచ్చే అవకాశం ఉంది. అయితే జనసమీకరణ, ర్యాలీలు, ఊరేగింపులు, రోడ్‌షోలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. జగన్ కాన్వాయ్‌కు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.

జిల్లా జైలుకు సుమారు ఒక కిలోమీటర్ దూరంలోనే వాహనాలను నిలిపివేయాలని పోలీసులు నిర్ణయించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పర్యటన నిర్వహించాలని సూచించారు. అలాగే 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇక, జగన్ పర్యటన కేవలం జైలులో ములాఖత్‌కే పరిమితమని, బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్‌షోలకు ఎలాంటి అనుమతి లేదని కర్నూలు జిల్లా ఎస్పీ సునీల్ షొరాన్ స్పష్టం చేశారు. పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

జగన్ టూర్ షెడ్యూల్
* ఉదయం 9:00 గంటలకు: తాడేపల్లిలోని నివాసం నుంచి జగన్ బయలుదేరుతారు..
* ఉదయం 9:45 గంటలకు: గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
* ఉదయం 10:00 గంటలకు: గన్నవరం నుంచి విమానంలో బయలుదేరుతారు.
* సుమారు 10:50–11:00 గంటలకు: కర్నూలు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
* అనంతరం: రోడ్డు మార్గంలో కర్నూలు జిల్లా జైలుకు ప్రయాణం.
* కాన్వాయ్ మార్గం: నన్నూరు, టోల్‌గేట్, హ్యాంగ్‌ఔట్, కృష్ణానగర్ ఐటీసీ, చెన్నమ్మ సర్కిల్, బళ్లారి చౌరస్తా, వెంకటరమణ కాలనీ, సంతోష్‌నగర్ మీదుగా పంచలింగాల జిల్లా జైలు.
* మధ్యాహ్నం 12:30 గంటల నుంచి: జిల్లా జైలులో ఎమ్మెల్యే విరూపాక్షితో ములాఖత్.
* మధ్యాహ్నం 12:30 నుంచి 3:00 గంటల మధ్య: ములాఖత్‌కు అనుమతి.
* ములాఖత్ అనంతరం: మీడియాతో మాట్లాడే అవకాశం, ఆపై తిరుగు ప్రయాణం.

జగన్ పర్యటనకు పోలీసుల షరతులు
జగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చారు. ఆయన పర్యటన జైల్లో ములాఖత్‌కు మాత్రమే పరిమితం కావాలని పోలీసులు స్పష్టం చేశారు.
* బహిరంగ సభలకు అనుమతి లేదు.
* ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదు.
* రోడ్‌షోలకు అనుమతి లేదు.
* జగన్ కాన్వాయ్‌కి మాత్రమే పోలీసుల అనుమతి ఉంటుంది.
* జిల్లా జైలుకు సుమారు 1 కిలోమీటరు దూరంలోనే వాహనాలను నిలిపివేయనున్నారు.
* ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పర్యటన నిర్వహించాలని పోలీసులు సూచించారు.
* 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు.
* నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నంద్యాల ఎస్పీ సునీల్ షొరాన్ మాట్లాడుతూ.. జగన్ కర్నూలు పర్యటన సందర్భంగా బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్‌షోలు నిర్వహిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. జైలులో విరూపాక్షితో ములాఖత్ వరకు మాత్రమే అనుమతి ఉందని తెలిపారు. పర్యటన ప్రశాంతంగా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జరిగేలా అందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.