Firecracker Factory Blast: కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఉన్న క్రాకర్స్ తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా భారీ శబ్దాలతో పేలుడు చోటుచేసుకోవడంతో పరిసర ప్రాంతాలు వణికిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 20 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. పేలుడు తీవ్రతకు భవనం ధ్వంసమై మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. పేలుడు ప్రభావంతో సమీపంలోని కొన్ని ఇళ్లు కూడా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తూ వివరాలు సేకరిస్తున్నారు.
Read Also: TTD Budget 2026: రూ.5,456 కోట్లతో టీటీడీ బడ్జెట్.. శ్రీవారి ఆదాయం ఎన్ని కోట్లు అంటే..!
ప్రాథమిక సమాచారం ప్రకారం 20 మంది కార్మికులు మంటల్లో చిక్కుకోగా.. ఇప్పటివరకు నలుగురు మృతి చెందినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత వెల్లడికానున్నాయి. అయితే, మంటల్లో 20 మంది కార్మికులు చిక్కుకోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదం ఉందంటున్నారు..
