Chittoor District: చిత్తూరు జిల్లాలో నిరుద్యోగులకు వైద్య ఆరోగ్యశాఖ శుభవార్త అందించింది. ఈ మేరకు జిల్లా ఆస్పత్రిలో ఖాళీల భర్తీకి ఆమోదం తెలిపింది. స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, పీడియాట్రీషియన్, సెక్యూరిటీ గార్డ్స్, మెడికల్ ఆఫీసర్ విభాగాలలో 53 ఖాళీలను భర్తీ చేసేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పలు పోస్టులకు కనీస అర్హత ఐదో తరగతి మాత్రమే. మిగతా పోస్టులకు సంబంధిత అంశంలో డిగ్రీ, డిప్లొమా, ఎంబీబీఎస్.. అర్హతలుగా నిర్ణయించింది. విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తామని అధికారులు తెలిపారు. ఇందుకు ఎలాంటి రాతపరీక్ష ఉండదని వారు స్పష్టం చేశారు. అర్హత, అనుభవం ఉన్న అభ్యర్థులు పోస్టు ద్వారా ఈ నెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Read Also: Last weekend: పది సినిమాలతో ఈ యేడాదికి వీడ్కోలు!
కాగా పోస్టులను బట్టి ఐదో తరగతి, 10వ తరగతి, ఇంటర్ లేదా జీఎన్ఎం లేదా డిగ్రీ బీఎస్సీ లేదా ఎంబీబీఎస్ లేదా డిప్లొమా లేదా పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్, ఉద్యోగ అనుభవం తప్పనిసరిగా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజిస్ట్రేషన్ ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ. 300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంపికైన అభ్యర్థులు ఆయా పోస్టులను బట్టి రూ.12 వేల నుంచి రూ.1,10,000 వేల వరకు నెలనెలా జీతంగా అందుకుంటారు. ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా వైద్యాధికారి కార్యాలయం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్కు దరఖాస్తులను పంపవచ్చు.
